West Bengal : రెండేళ్ళలోనే మారిన ఓటరు అభిప్రాయం!
ABN , First Publish Date - 2021-05-02T18:22:00+05:30 IST
ఓటరు నాడిని పసిగట్టడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. వరుసగా
కోల్కతా : ఓటరు నాడిని పసిగట్టడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. వరుసగా ఒకే పార్టీని ఆదరిస్తారనే భరోసా లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో ప్రత్యేక తేడాను గమనిస్తున్నారేమో మరి. ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఓ పార్టీని ఆదరించి, శాసన సభ ఎన్నికల్లో మరో పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా బెంగాలీల్లో మార్పు బాగా కనిపించింది. రాష్ట్రంలోని 42 లోక్సభ స్థానాల్లో బీజేపీకి 18 స్థానాలు లభించాయి. 2,30,28,343 ఓట్లు (40.25 శాతం) ఆ పార్టీకి లభించాయి. అయితే తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఓటరు మనసు మారింది. బీజేపీ ఎంపీలు ఉన్న నియోజకవర్గాల పరిధిలోని శాసన సభ నియోజకవర్గాల్లో కూడా టీఎంసీనే ఆదరిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాలను దక్కించుకుంది. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల కన్నా 12 స్థానాలు తగ్గినప్పటికీ, ఓట్ల శాతాన్ని 0.27 శాతం పెంచుకుంది.
2019 ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య రీతిలో సీట్లు లభించినప్పటికీ, తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీఎంసీకే ప్రజలు పట్టం కట్టినట్టు తెలుస్తోంది. బీజేపీ ఎంపీలు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ స్థానాల్లో కూడా టీఎంసీ దూసుకెళ్తోంది.