గాంధీ విగ్రహం ముందు మమత ధర్నా
ABN , First Publish Date - 2021-04-13T17:24:00+05:30 IST
ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగారు. కోల్కతాలోని గాంధీ విగ్రహం దగ్గర మంగళవారం మధ్యాహ్నం నిరసన దీక్ష చేపట్టారు.
కోల్కతా: ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగారు. కోల్కతాలోని గాంధీ విగ్రహం దగ్గర మంగళవారం మధ్యాహ్నం నిరసన దీక్ష చేపట్టారు. మమతపై ఎలక్షన్ కమిషన్ 24 గంటల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 12న రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 13న రాత్రి 8 గంటల వరకు 24 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. దీనిపై తృణమూల్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ప్రసంగాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అభియోగంపై ఒకరోజు పాటు ప్రచారంలో పాల్గొనరాదని ఎలక్షన్ కమిషన్ నిషేధం విధించింది. ముస్లింలు గుండగుత్తగా తృణమూల్ అభ్యర్థులకే ఓటేయాలని పిలుపివ్వడం, కేంద్ర బలగాలను ఘెరావ్ చేయండని, వాటిపై తిరగబడమని ప్రజలను రెచ్చగొట్టడం, మొదలైన చర్యల ద్వారా ఆమె ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని బీజేపీ ఫిర్యాదు చేసింది. వీటిపై సమాధానమివ్వాలంటూ ఈసీ ఆమెకు కిందటివారం రెండు నోటీసులిచ్చింది. తన వ్యాఖ్యలను ఆమె సమర్థించుకోవడంతో సంతృప్తి చెందని ఈసీ 24గంటల పాటు ప్రచారంలో పాల్గొనరాదని, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం జరపరాదని ఆంక్ష పెట్టింది. ఈ నిషేధం మంగళవారం రాత్రి 8 గంటల దాకా అమల్లో ఉంటుంది. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. మంగళవారం మధ్యాహ్నం నుంచి కోల్కతాలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నట్లు మమత ప్రకటించారు.