కోవిడ్-19పై సమీక్షకు మమత ఆదేశం
ABN , First Publish Date - 2021-12-29T21:01:36+05:30 IST
పశ్చిమ బెంగాల్లో కోవిడ్-19 మహమ్మారిపై సమీక్షించాలని
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కోవిడ్-19 మహమ్మారిపై సమీక్షించాలని ముఖ్యమంత్రి మమత బెనర్జీ బుధవారం అధికారులను ఆదేశించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న చోట్ల కట్టడి ప్రాంతాలుగా గుర్తించాలని తెలిపారు. ఈ మహమ్మారి మూడో ప్రభంజనం రాబోతోందనే హెచ్చరికల నడుమ ఆమె ఈ ఆదేశాలు ఇచ్చారు.
పరిస్థితులనుబట్టి అవసరమైతే పాఠశాలలను, కళాశాలలను కొంత కాలంపాటు మూసివేయవచ్చునని చెప్పారు. అదే విధంగా 50 శాతం మంది ఉద్యోగుల హాజరుతో కార్యాలయాలను నిర్వహించాలని కూడా కోరవచ్చునని చెప్పారు.
కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని, కొన్ని ఒమైక్రాన్ కేసులు కూడా నమోదయ్యాయని మమత బెనర్జీ చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, స్థానిక రైలు సర్వీసులపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
గంగా సాగర్ మేళా ఏర్పాట్లపై సమీక్షించేందుకు మమత బెనర్జీ బుధవారం సాగర్ దీవిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.