బేకరీకి వెళ్లి బతికిపోయింది..!

ABN , First Publish Date - 2020-05-31T11:52:39+05:30 IST

బేకరీకి వెళ్లి బతికిపోయింది..!

బేకరీకి వెళ్లి బతికిపోయింది..!

నార్సింగ్‌ (ఆంధ్రజ్యోతి): పదేళ్ల కుమారుడి కళ్లకు గంతలు కట్టి ఉరి వేయడంతో పాటు తనూ ఉరి వేసుకున్న అధ్యాపకురాలి ఘటనలో ఆమె 14 నెలల చిన్నారి పనిమనిషితో కలిసి బేకరీ షాపునకు వెళ్లడంతో బతికిపోయింది. హైదర్షాకోట్‌కు చెందిన సతీష్‌ భార్య భార్గవి(30) తన పదేళ్ల కుమారుడు వరణ్యతో కలిసి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మిస్టరీగా మారిన నేపథ్యంలో పోలీసులు శనివారం అన్ని వివరాలు సేకరించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భార్గవి ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.    కానీ, తాను చనిపోతే తన పిల్లల బతుకు ఏమవుతోందో అన్న బెంగతో కుమారుడికి ఉరి వేసి, తనూ ఉరివేసుకుందని భావిస్తున్నారు. శుక్రవారం 14 నెలల చిన్నారి పని మనిషితో కలిసి బేకరీ షాపునకు వెళ్లింది. ఆ సమయంలోనే భార్గవి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకుందని, అందుకే ఆ చిన్నారి బతికి పోయిందని నార్సింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ తెలిపారు. సాధారణంగా ఇలాంటి మనస్తత్వం గల వారు తన పిల్లలను తనకంటే ఎవరూ బాగా చూడలేరని, చనిపోయిన తర్వాత కలిసి ఉంటామని భ్రమపడుతారని, అందుకే పిల్లలను చంపుకుంటారని అభిప్రాయపడ్డారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం భర్తకు అప్పగించామని, పోస్టుమార్టంలో ఆత్మహత్యగా తేలిందని చెప్పారు. కాగా, మృతదేహాలను వారి స్వగ్రామమైన గుంటూరుకు తీసుకెళ్లలేకపోయారని, దీంతో ఇక్కడే ఖననం చేశారని పోలీసులు తెలిపారు. ఆ 14 నెలల చిన్నారికి ఇప్పుడు తల్లిలేకుండా పోయింది. ఇదిలా ఉండగా, డాక్టర్‌ తనకు ట్రీట్‌మెంట్‌ సరిగా చేయలేదని, వారిపై చర్య తీసుకోవాలని భార్గవి సూసైడ్‌నోట్‌లో రాసినట్లు తెలిసింది. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదించగా, అలాంటిదేమీ రాయలేదని కొట్టి పారేశారు. 

Updated Date - 2020-05-31T11:52:39+05:30 IST