వెంటాడుతున్న బర్డ్ఫ్లూ భయం
ABN , First Publish Date - 2021-01-12T05:25:31+05:30 IST
గ్రామాల్లో సంక్రాంతి వస్తుందంటే చాలు కోడిపందాలు, చికెన్ వంటలు తప్పనిసరి.
పందెం కోళ్ల పెంపకందారుల ఆందోళన
తగ్గిన మాంసం విక్రయాలు
ఏలూరు రూరల్, జనవరి 11 : గ్రామాల్లో సంక్రాంతి వస్తుందంటే చాలు కోడిపందాలు, చికెన్ వంటలు తప్పనిసరి. ప్రతి ఏటా లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఈ ఏడాది బర్డ్ఫ్లూ భయం వెంటా డుతుం డడంతో సంక్రాంతి సంబరాలు, నాన్వెజ్ ప్రియులకు ఇబ్బందిక రంగా మారింది. సంక్రాంతి కోసం ఏలూరు మండలంలో ఏడాది పొడవునా పెంచుకున్న కోళ్లను సిద్ధం చేసుకున్నా వాటి యజమానులు మాత్రం బర్డ్ఫ్లూ వ్యాధి ఎక్కడ సోకుతుందన్న భయంతో ఉన్నారు. కరోనా తగ్గుముఖం పడుతుందని భావిస్తున్న సమయంలో బర్డ్ఫ్లూ ప్రభావం గ్రామా ల్లో లేక పోయినా ఇతర ప్రాంతాల్లో పలుచోట్ల కోళ్లు చనిపోతున్న వార్తలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో బర్డ్ఫ్లూ భయంతో చికెన్ధర డిమాండ్ పడి పోవడంతో వ్యాపారులను నిద్ర లేకుండా చేస్తోంది. మరోవైపు ఏలూరు పరిసర గ్రామాల్లో సంక్రాంతి పందెం కోళ్లకు ఈ వైరస్ ఎక్కడ సోకుతుందోనని వాటి యజమానులు భయ పడుతున్నారు. ఇప్పటికే కాజు, పిస్తా, బదం పప్పులతో కోళ్లను మేపుతున్నారు. అయితే బర్డ్ఫ్లూ భయం వారిని వెంటాడుతోంది. ఫ్లూసోకి కోడి చనిపోతే నష్టం తప్పదు. ఇలా పెద్ద సంఖ్యలో కోళ్ళు చనిపోతే సంక్రాంతి సంబరం కళ తప్పనుంది.
మాంసం అమ్మకాలపై ప్రభావం
బర్డ్ఫ్లూ భయంతో ఇళ్లకు కోడి మాంసం తెచ్చుకునేవారు కరువయ్యారు. నిన్నటి వరకూ కేజీ రూ.200లకు పైగా పలికిన ధర రూ.వందకు దిగొచ్చినా తినేవారే కరువయ్యారు. బిర్యానీ పాయింట్లు, హోటళ్ళ యజమానులు కూడా డిమాండ్ తగ్గడంతో కొనుగోళ్లు తగ్గించారు. నాన్వెజ్ ప్రియులు చికెన్ బిర్యానీ ఆర్డర్లు తగ్గించేశారు. అమ్మకాలు భారీగా తగ్గాయని మాంసం దుకాణదారులు పేర్కొం టున్నారు. సంక్రాంతి సీజన్లో ఇళ్లల్లో కోడి మాంసం తెచ్చుకోవాలంటే బర్డ్ఫ్లూ భయం వెంటాడుతోంది. పశు సంవర్థకశాఖ అధికారులు కోడి మాంసం తినవచ్చని చెబుతున్నా వారి మాటలను వారిలో విశ్వాసం నింపలేక పోతున్నాయి.