పెళ్లింట్లో విషాదం
ABN , First Publish Date - 2021-08-28T23:46:43+05:30 IST
పెళ్లింట్లో పెను విషాదం నెలకొంది. కారు అతివేగంతో బ్రిడ్జి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో పెళ్లి కూతురుతో పాటు ఆమె తండ్రి మృతి చెందారు.
ఖానాపూర్: పెళ్లింట్లో పెను విషాదం నెలకొంది. కారు అతివేగంతో బ్రిడ్జి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో పెళ్లి కూతురుతో పాటు ఆమె తండ్రి మృతి చెందారు. ఈఘటన నిర్మల్ జిల్లా కడెంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. కడెం మండలం పాత మద్దిపడగ గ్రామానికి చెందిన కొండ వసంత, రాజయ్య ( 49 ) దంపతుల కూతురు మౌనిక (25 )కు ఈ నెల 25వ తేదీన మహారాష్ట్రలోని బల్లర్ష రాజురా గ్రామానికి చెందిన జనార్దన్తో వివాహం జరిగింది. శుక్రవారం రాత్రి బల్లర్ష రాజురాలో విందు ( రిసెప్షన్ ) ముగించుకొని కుటుంబీకులు పాత మద్దిపడగ గ్రామానికి కారులో వస్తుండగా.. పాండ్వాపూర్ బ్రిడ్జి డివైడర్ను అతి వేగంగా ఢీకొట్టి.. బ్రిడ్జి కిందకు పడిపోయింది. ఈ ఘటనలో పెళ్లి కూతురు మౌనికతో పాటు ఆమె తండ్రి రాజయ్య అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ఉన్న పెళ్లి కొడుకు జనార్దన్, పెళ్లి కూతురు తల్లి వసంతతో పాటు డ్రైవర్కు గాయాలయ్యాయి. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయానికి ప్రమాదం జరిగి ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందడంతో పాత మద్దిపడగ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురు తండ్రి మృతదేహాన్ని చూసి గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు.