హెల్మెట్ ధరిస్తేనే రోడ్లపైకి అనుమతి : సీఐ
ABN , First Publish Date - 2021-05-17T06:27:48+05:30 IST
ద్విచక్ర వాహనచోదకులు హెల్మెట్ లేకుండా రోడ్ల పైకి వస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిర్మల్ రూరల్ సీఐ వెంకటేష్ అన్నారు. ఆదివారం దిలావర్పూర్ టోల్ప్లాజా వద్ద ద్విచక్ర వాహన చోదకులకు రోడ్డు నియమాలపై అవగాహన కల్పించారు.
దిలావర్పూర్, మే 16: ద్విచక్ర వాహనచోదకులు హెల్మెట్ లేకుండా రోడ్ల పైకి వస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిర్మల్ రూరల్ సీఐ వెంకటేష్ అన్నారు. ఆదివారం దిలావర్పూర్ టోల్ప్లాజా వద్ద ద్విచక్ర వాహన చోదకులకు రోడ్డు నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు వాహనానికి సంబంధించిన పత్రాలు ఉంచుకోవాలన్నారు. పరిమితికి మించి వేగంగా వాహనం నడిపితే చట్టప్రకారం శిక్షర్హులవుతారని హెచ్చ రించారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని అన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిని మరోమారు హెల్మెట్తో కనిపించాలని హెచ్చరించి పంపించారు. సీఐ వెంట ఎస్సై సంజీవ్ కుమార్, ట్రైనీ ఎస్సై సతీష్ ఉన్నారు.
సోన్: ద్విచక వాహనదారులు హెల్మెట్ ఉంటేనే రోడ్డు మీదకు రావాలని సీఐ జీవన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గంజాల్ గ్రామ టోల్ప్లాజా వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హెల్మెట్ లేకుండా రోడ్డు పైకి వచ్చే వాహనాలను ఆపి స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులకు జరిమానా వేయడానికి బదులుగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ హెల్మెట్ ఒక వస్తువు కాదని ప్రాణాన్ని కాపాడే ఆయుధం లాంటిదన్నారు. హెల్మెట్ ధరించక పోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందడం జరుగుతుందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ను ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మామడ ఎస్సై వినయ్, శిక్షణ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.