మా వాళ్ల జోలికొస్తే తాటతీస్తాం

ABN , First Publish Date - 2022-10-04T04:41:00+05:30 IST

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికొస్తే తాట తీస్తామని విప్‌ కాపు రామచంద్రారెడ్డిని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు.

మా వాళ్ల జోలికొస్తే తాటతీస్తాం
విలేకరులతో మాట్లాడుతున్న కాలవ

కాపు రామచంద్రారెడ్డికి కాలవ వార్నింగ్‌ 

  రాయదుర్గం, అక్టోబరు 3: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికొస్తే తాట తీస్తామని విప్‌ కాపు రామచంద్రారెడ్డిని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు. గుమ్మఘట్ట మండలం భైరవానతిప్ప గ్రామంలో బెస్త మూర్తిపై ఇంటి వద్దకు వెళ్లి కాపు రామచంద్రారెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పట్టణంలోని రూరల్‌ సర్కిల్‌ కార్యాలయానికి సోమవారం వెళ్లి, సీఐ యుగంధర్‌తో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు తమ పార్టీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి దాడి చేసిన ఎమ్మెల్యేను వదిలి, బాధితుడిపైనే కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. బాధితుడి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి తనతో ఫొటో దిగాలని, లేకపోతే అంతుచూస్తానని ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ కార్యకర్త మూర్తిని కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఈ తతంగమంతా గుమ్మఘట్ట ఎస్‌ఐ కళ్లముందే జరిగిందని అన్నారు. కాపు రామచంద్రారెడ్డి వాస్తవాలను కప్పిపుచ్చి, కోడికత్తి డ్రామాలకు తెరలేపారని అన్నారు. కాపు నీచ సంస్కృతిని, దౌర్జన్యాలను ప్రజల ముందుకు తీసుకువెళతామని తెలిపారు. రెచ్చగొట్టి దాడులకు పాల్పడితే కాపు రామచంద్రారెడ్డి తాట తీయాలని ప్రజలకు కాలవ పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు తాము ఎంతదూరమైనా వెళతామని అన్నారు. 



Updated Date - 2022-10-04T04:41:00+05:30 IST