ముఖ్యమంత్రిని అడ్డుకొని తీరుతాం

ABN , First Publish Date - 2022-08-16T05:58:44+05:30 IST

ముఖ్యమంత్రిని అడ్డుకొని తీరుతాం

ముఖ్యమంత్రిని అడ్డుకొని తీరుతాం
మాట్లాడుతున్న చంద్రశేఖర్‌

  •  మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్రశేఖర్‌

వికారాబాద్‌, ఆగస్టు 15: సీఎం కేసీఆర్‌ వికారాబాద్‌ పర్యటనను అడ్డుకొని తీరుతామని మాజీమంత్రి, బీజేపీ నాయకుడు ఏ. చంద్రశేఖర్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. జనగామ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ గూండాలు దాడిచేయడం అమానుషమని, బీజేపీ కార్యక్రమాలను, సమావేశాలను టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకోవడం సరికాదన్నారు. గతంలో టీపీడీలో ఉన్న సమయంలో కేసీఆర్‌కు స్నేహితుడిగా తాను ఎన్నో సలహాలు ఇచ్చానని, వాటిని ఆయన వినేవారన్నారు. ఇప్పుడు అభివృద్ధి కోసం ఇచ్చే సలహాలూ తీసుకోవాలని చంద్రశేఖర్‌ అన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామికం నడుస్తోందని, కేసీఆర్‌ను కలసి వినతిపత్రం ఇస్తామంటే కూడా అనుమతి లేదని కలెక్టర్‌, ఎస్పీ చెబుతున్నారన్నారు. కేసీఆర్‌ గతంలో జిల్లా అభివృద్ధికి ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు అందివ్వాలన్నారు. వికారాబాద్‌లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ల వాసన కూడా లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శివరాజ్‌, మాధవరెడ్డి, మధుసూదన్‌, శివప్రసాద్‌ ఉన్నారు. ఇదిలా ఉంటే వికారాబాద్‌లో ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ శాకం సతీష్‌ కూడా ప్రకటించారు.

Updated Date - 2022-08-16T05:58:44+05:30 IST