ప్రీమియం మేము చెల్లిస్తాం.. నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించగలదా !
ABN , First Publish Date - 2021-12-01T04:50:00+05:30 IST
రైతుల పంటల సాగుకు సంబంధించిన బీమా ప్రీమియం తాము చెల్లిస్తామని, నష్టపరిహారం చెల్లించడానికి సీఎం సిద్ధంగా ఉన్నారా అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ సీఎంకు సవాల్ విసిరారు.
సీఎంకు సవాల్ విసిరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ
కమలాపురం (రూరల్), నవంబరు 30: రైతుల పంటల సాగుకు సంబంధించిన బీమా ప్రీమియం తాము చెల్లిస్తామని, నష్టపరిహారం చెల్లించడానికి సీఎం సిద్ధంగా ఉన్నారా అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ సీఎంకు సవాల్ విసిరారు. కమలాపురంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా ప్రీమియం తాము ప్రభుత్వం తరపున చెల్లిస్తామని, సీఎం స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులెవ్వరూ బీమా చెల్లించలేదన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలకు రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారన్నారు. సీఎం హామీ ఇచ్చి కూడా పంటల బీమా ప్రీమియం చెల్లించలేదన్నారు. దీంతో ప్రస్తుతం రైతులకు పంటల బీమా రాకపోవడంతో ఎకరాకు దాదాపు రూ.10 వేల నుంచి రూ.15 వేలు, మెట్ట ప్రాంత రైతులకు రూ.30 వేల వరకు నష్టం జరిగిందన్నారు. సీఎం బీమా కంపెనీలతో మాట్లాడి బీమా ఇవ్వడానికి ఒప్పిస్తే 48 గంటల్లో టీడీపీ తరపున రైతుల కోసం దాదాపు రూ.3.50 కోట్లు ప్రీమియం చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి రాంప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ జనార్ధన్, ఐటీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ, కల్లూరి జనార్ధన్రెడ్డి, అప్పాజి పాల్గొన్నారు. అంతకుముందు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తమను ఆదుకోవాలని రైతులు కోరారు.