వేతనాలు చెల్లించకపోతే ఉద్యమిస్తాం
ABN , First Publish Date - 2021-07-25T05:54:53+05:30 IST
వేతన బకాయిలు చెల్లించకపోతే ఉద్యమిస్తామని ఉపాధి పథకం కూలీలు హెచ్చరించారు.
ఉపాధి కూలీల ఆందోళన
రోలుగుంట, జూలై 24: వేతన బకాయిలు చెల్లించకపోతే ఉద్యమిస్తామని ఉపాధి పథకం కూలీలు హెచ్చరించారు. మండలంలోని కొమరవోలు, రోలుగుంట, కొవ్వూరు, శరభవరం తదితర గ్రామాల్లో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఈరెల్లి చిరంజీవి, ఒనుం శ్రీనివాసరావు మాట్లాడుతూ, దాదాపు రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం గతంలో ఎన్నడూ లేదన్నారు. వేతనాలు అందక కూలీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కూడా కల్పించడం లేదన్నారు. ఉపాధి హమీ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని వారు పేర్కొన్నారు. నెలాఖరులోగా వేతన బకాయిలు చెల్లించకపోతే ఉపాధి కార్యాలయాల ఎదుట ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.