విశాఖను సేఫ్‌ సిటీగా తీర్చిదిద్దుతాం

ABN , First Publish Date - 2021-04-13T06:11:53+05:30 IST

విశాఖ నగరాన్ని సేఫ్‌ సిటీగా తీర్చిదిద్దడానికి పోలీస్‌ శాఖ పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ సిన్హా పేర్కొన్నారు.

విశాఖను సేఫ్‌ సిటీగా తీర్చిదిద్దుతాం
మీడియాతో మాట్లాడుతున్న సీపీ మనీశ్‌కుమార్‌ సిన్హా

నగర పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ సిన్హా

భీమునిపట్నం, ఏప్రిల్‌ 12: విశాఖ నగరాన్ని సేఫ్‌ సిటీగా తీర్చిదిద్దడానికి పోలీస్‌ శాఖ పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ సిన్హా పేర్కొన్నారు. సోమవారం భీమిలి పోలీస్‌ స్టేషన్‌లో దివీస్‌ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల మానిటరింగ్‌ సిస్టమ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నగరంలో నేరాల నియంత్రణలో ఎంతగానో ఉపయోగపడుతున్న సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈ విషయమై పలుమార్లు లాడ్జిలు, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్ల నిర్వాహకులుకు చెబుతున్నా కొద్దిమంది మాత్రమే స్పందించారన్నారు. దీంతో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేశామని, దీనిని పటిష్టంగా అమలు చేసేందుకు డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో 624 రెస్టారెంట్లను పరిశీలించగా 417 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాయని, 1217 అపార్ట్‌మెంట్లను పరిశీలించగా 5,100 సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. మిగిలినవారు వారం రోజుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. కాగా లంకెలపాలెం నుంచి తగరపువలస జంక్షన్‌ వరకూ హైవేలో 19 ముఖ్య కూడళ్లు ఉన్నాయని, బీచ్‌రోడ్‌లో కోస్టల్‌ బ్యాటరీనుంచి భీమిలి వరకూ కూడా అన్ని జంక్షన్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రానున్న రెండు నెలల్లో నగరంలో ఐదువేల నుంచి పదివేల వరకూ సీసీ కెమెరాలను ఏర్పాటు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ-1 ఐశ్వర్య రస్తోగి, దివీస్‌ ఎండీ మురళి దివి, సీఐ జి.శ్రీనివాస్‌, ఎస్‌ఐలు సంతోష్‌, రాంబాబు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-13T06:11:53+05:30 IST