సొసైటీ సభ్యులందరికీ న్యాయం చేస్తాం
ABN , First Publish Date - 2021-12-05T05:06:49+05:30 IST
గోపవరం ఫార్మింగ్ సొసైటీ సభ్యులందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు.
కలెక్టర్ విజయరామరాజు
గోపవరం, డిసెంబరు 4: గోపవరం ఫార్మింగ్ సొసైటీ సభ్యులందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. శనివారం మండలంలోని ఫార్మింగ్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఏర్పాటు చేయనున్న సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలాన్ని వచ్చిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గౌతమి, సబ్ కలెక్టర్ కేతన్గార్గ్ను పలువురు సొసైటీ సభ్యులు కలిశారు. కొందరు ఇతర సభ్యులు ఉన్నారని వారి వల్ల మాకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని, నిజమైన సభ్యులను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. సొసైటీ నిబంధనల ప్రకారం సభ్యులందరికీ ఇక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులను తెలియజేయాల్సి ఉందని అలా జరగడం లేదన్నారు. సొసైటీలోని సభ్యులందరికీ తప్పక న్యాయం చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం జేసీ, సబ్కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమణారెడ్డి, సర్వేయర్ శివకుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.