సివిల్స్‌కి సిద్ధమైతే సహకరిస్తాం

ABN , First Publish Date - 2021-07-31T07:56:44+05:30 IST

కారుణ్య నియామకాల్లో నియమితులైన టీటీడీ ఉద్యోగులు సివిల్స్‌ వంటి పోటీ పరీక్షలు రాస్తామన్నా ప్రోత్సహిస్తామని ఈవో జవహర్‌రెడ్డి అన్నారు.

సివిల్స్‌కి సిద్ధమైతే సహకరిస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి

కారుణ్య నియామకంలో చేరిన ఉద్యోగులతో టీటీడీ ఈవో


తిరుపతి, జూలై  30 (ఆంధ్రజ్యోతి): కారుణ్య నియామకాల్లో నియమితులైన టీటీడీ ఉద్యోగులు సివిల్స్‌ వంటి పోటీ పరీక్షలు రాస్తామన్నా ప్రోత్సహిస్తామని ఈవో జవహర్‌రెడ్డి అన్నారు. టీటీడీలో పని చేస్తున్న ఉద్యోగులు చనిపోవటంతో, వారి వారసులుగా కారుణ్య నియామకంలో నియమితులైన 119 మందికి శ్వేతలో 15 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ... టీటీడీలో అత్యున్నత పోస్టు డిప్యూటీ ఈవో అని, మీలో ఎవరైనా ఇంకా బాగా చదువుకుని మరింత ఉన్నత పదవులకు వెళ్లేందుకు యత్నిస్తే టీటీడీ పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. తాను కూడా తిరుపతిలోనే వెటర్నరీ వైద్య కోర్సు పూర్తి చేశానన్నారు. తమ సీనియర్‌ టీటీడీ మాజీ ఈవో  సాంబశివరావు కూడా వెటర్నరీ వైద్యులని, ఆయన 86లో బ్యాచ్‌లో ఐఏఎస్‌ చేశారన్నారు. ఆయన తెలివైన వ్యక్తి అని అయితే తనలో అదనంగా కష్టపడే తత్వం కూడా ఉందని తాను కూడా ఐఏఎస్‌ కావచ్చనే ఆత్మవిశ్వాసం కలిగిందన్నారు. అలా తాను ఐ.ఎ.ఎస్‌ అయ్యానన్నారు. తమలాగే ఇప్పుడు టీటీడీలో కారుణ్య నియామకాల్లో నియమితులైన వారు కూడా వృద్ధిలోకి రావచ్చంటూ తన అనుభవాలను వారితో పంచుకున్నారు. టీటీడీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగంలో నియమించేముందు 15 రోజులు నిపుణులచేత శిక్షణ ఇచ్చామని, ఫీల్డ్‌ విజిట్‌ చేయించామన్నారు. ఇలా శిక్షణ ఇవ్వటంలో కృషి చేసిన జేఈవో సదా భార్గవిని ఈవో అభినందించారు. ‘అనుకున్న చోట ఉద్యోగం రావచ్చు.. రాకపోవచ్చు. ఎక్కడ ఇచ్చినా ఉద్యోగం బాగా చేయాలి. దేవుడి కంటే డ్యూటీ ముఖ్యం అనే సిద్ధాంతాన్ని అనుసరించాలి. టీటీడీలో పని చేయటాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నా. టీటీడీలోనే శాశ్వతంగా పని చేసే అవకాశం అందరికీ సాధ్యం కాదు’ అని ఈవో జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. టీటీడీ ప్రతిష్ఠను మరింత పెంచాలని జేఈవో సదాభార్గవి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు శేషశైలేంద్ర, రామాంజుల రెడ్డి, గోవిందరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T07:56:44+05:30 IST