‘అగ్రి’లో కొత్త ఆవిష్కరణలకు సహకరిస్తాం
ABN , First Publish Date - 2022-10-08T06:16:08+05:30 IST
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో చేపట్టే కొత్త ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు.
తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ
17 అంకుర సంస్థలకు రూ.58.90లక్షల పంపిణీ
తిరుపతి(విద్య), అక్టోబరు 7: వ్యవసాయ, అనుబంధ రంగాల్లో చేపట్టే కొత్త ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (ఆర్ఏఆర్ఎ్స)లో ఆర్కేవీవై-రాఫ్తార్ పథకంలో భాగంగా అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్ ద్వారా మూడో బ్యాచ్లో ఎంపికైన 17 వ్యవసాయ, అనుబంధశాఖల అంకుర సంస్థలకు మొదటవిడతకింద శుక్రవారం రూ.58.90లక్షల గ్రాంటును చెక్కు రూపంలో పంపిణీ చేశారు. ముఖ్యఅతిధిగా వచ్చిన సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎన్నో విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలతోపాటు ఐఐటీ, ఐసర్ వంటి కేంద్ర సంస్థలు ఉన్న తిరుపతిని ప్రభుత్వం నూతన ఆవిష్కరణల కారిడార్గా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేసి.. కొత్త ఆవిష్కరణలకు తోడ్పాటునందించి దేశ ఆర్థికవ్యవస్థకు ఊతమివ్వాలని ఆకాంక్షించారు. ఇన్చార్జి ఏడీఆర్ డాక్టర్ ఎస్.కలీముల్లా మాట్లాడుతూ.. దేశంలోని 29 ఇంక్యుబేటర్లలో రాష్ర్టానికి చెందిన అగ్రిబిజినెస్ ఇంక్యుబేటర్ కేంద్రం ద్వారా ఇప్పటివరకు 41స్టార్టప్ సంస్థలను నమోదు చేసి.. రూ.2.88కోట్ల నిధులు విడుదల చేశారని చెప్పారు. ఈసీసభ్యుడు మురళీనాథరెడ్డి మాట్లాడుతూ.. కొత్త అంకురసంస్థలను ఏర్పాటుచేసి వ్యవసాయరంగ అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. ఇన్చార్జి ఏడీ డాక్టర్ కరుణాసాగర్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ పి.బాలహుస్సేన్రెడ్డి, స్కీమ్ బిజినెస్ మేనేజర్ డాక్టర్ నరే్షరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మీతులసి, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ రమాదేవి, హెడ్ డాక్టర్ సత్యగోపాల్, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
సీడ్స్టేజ్ స్టార్ట్ప్సకి ఎంపికైన సంస్థలివీ
రూ.25లక్షల కేటగిరీలో వహీద్ ఆగ్రో ఇంజనీరింగ్ వర్క్స్(షేక్ అబ్దుల్కలాం, ఫౌండర్) సంస్థకు మొదటి విడతకింద రూ.5.20లక్షలు, జీఎంఎన్ అగ్రి ఇన్నోవేషన్స్ (జి.మంజునాథ్, ఫౌండర్)కి రూ.6లక్షలు, వసువర్ధిని క్యాటిల్ ఫీడ్స్ (దివ్యప్రభ ధనపాల్ భోస్లే, ఫౌండర్)కి రూ.6లక్షలు, యువర్ ఫాం అగ్రిటెక్ (జనని శాంతమూర్తి, ఫౌండర్)కి రూ.6లక్షల చొప్పున మొత్తం 23.20లక్షలు పంపిణీ చేయగా.. రూ.5లక్షల కేటగిరీలో షేక్ ఖాదర్మస్తాన్కి రూ.3లక్షలు, షేక్ అసదుల్లాకి రూ.1.80లక్షలు, శ్రీరామన్కి రూ.3లక్షలు, ఎస్కే మౌలాలికి రూ.2.40లక్షలు, ఎ.దామోదర్కి రూ.3లక్షలు, దూదేకుల నబిసాబ్కి రూ.3లక్షలు, దాసరి కిరణ్కి రూ.3లక్షలు, విమల్రాజ్కి రూ.1.50లక్షలు, డాక్టర్ సీఏవై భానుప్రియకి రూ.3లక్షలు, మహదేవస్వామికి రూ. 3లక్షలు, ఎస్.జైకుమార్కి రూ.3లక్షలు, సాయినాగలోకే్షకి రూ.3లక్షలు, రాజశేఖరన్కి రూ.3లక్షలు చొప్పున మొత్తం 35.70లక్షలను పంపిణీ చేశారు. 17మందికి కలిపి రూ.58.90లక్షల చెక్కులను అందజేశారు.