పక్కదేశాల్లోనైనా ఐపీఎల్ నిర్వహిస్తాం: బీసీసీఐ

ABN , First Publish Date - 2020-07-03T01:57:21+05:30 IST

కరోనా తగ్గినా, తగ్గకున్నా.. ఐపీఎల్ మాత్రం కచ్చితంగా నిర్వహించేలా ఉంది బీసీసీఐ. ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన...

పక్కదేశాల్లోనైనా ఐపీఎల్ నిర్వహిస్తాం: బీసీసీఐ

న్యూఢిల్లీ: కరోనా తగ్గినా, తగ్గకున్నా.. ఐపీఎల్ మాత్రం కచ్చితంగా నిర్వహించేలా ఉంది బీసీసీఐ. ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన ఐపీఎల్-2020 సీజన్ కరోనా మహమ్మారి వల్ల నిరవధికంగా వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ కరోనార్పణం అయినట్లేనని సగటు క్రికెట్ అభిమాని ఓ నిర్ణయానికొచ్చేశాడు. అయితే బీసీసీఐ మాత్రం వారిలో ఆశలను చిగురింపజేసేలా అప్పుడప్పుడూ కొన్ని ప్రకటనలను విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా నేడు కూడా ఓ ప్రకటన చేసింది. అయితే ఈ సారి కచ్చితమైన ప్రకటన చేసింది. భారత్‌లో కుదరకపోతే  పక్కదేశాల్లోనైనా ఐపీఎల్-2020 నిర్వహిస్తామని, అందుకు అవసరమైన అన్ని మార్గాలను వెదుకుతున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.


ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్ నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో పక్కదేశాల్లోనైనా ఈ సీజన్ నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికోసం శ్రీలంక, యూఏఈ దేశాలను ముందుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే నిర్వహణకు సంబంధించిన తేదీలను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే దాదాపు 4 నెలలుగా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీసీసీఐ ఈ ప్రకటన చేసి వారికి పెద్ద తీపికబురు అందించింది.

Updated Date - 2020-07-03T01:57:21+05:30 IST