మీతోనే ఉంటాం.. మీ వెంటే నడుస్తాం
ABN , First Publish Date - 2022-06-27T05:16:45+05:30 IST
మీతోనే ఉంటాం.. మీవెంటే నడుస్తామని దళిత యువకులు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డితో అన్నారు.
టీడీపీ ఇన్చార్జి ఉగ్రతో దళిత యువకులు
పార్టీలో చేరేందుకు సిద్ధం
కనిగిరి, జూన్ 26 : మీతోనే ఉంటాం.. మీవెంటే నడుస్తామని దళిత యువకులు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డితో అన్నారు. ఆదివారం వెలిగండ్ల మండలానికి చెందిన 100 యువకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వారంతా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై వేధింపులు, దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఆగడాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి పాటుపడతామని యువకులు ఉగ్రకు తెలిపారు. బైబిల్ పట్టుకుని దళితుల్లో సానుభూతి ఓట్లు దండుకున్న జగన్రెడ్డికి గుణపాఠం చెప్తామన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా మీరు మాకు అన్ని సమయాల్లో అండగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో మా బలమేంటో చూపిస్తామన్నారు. గ్రామాల్లో వైసీపీ నేతల అరాచకాలు ఎక్కువయ్యాయని, దళితుల భూములను కూడా ఆక్రమించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అడిగేవారిపై తప్పుడు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు అండగా ఉండి గెలిపించుకుంటామని అందుకు బేషరతుగా 21 పంచాయతీల దళితులంతా మద్దతుగా ఉంటామని ప్రకటించారు. అనంతరం డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ అణగారిని వారి అభ్యున్నతే టీడీపీ విధానమన్నారు. దళితులకు అండగా నిలబడతానని, మీరు ఏ ఆపదలో ఉన్నా ఒక్క ఫోన్కాల్ చేస్తే మీ ముందుంటానన్నారు. వైసీపీ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు టీడీపీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఉగ్ర యువకులను కోరారు. ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వాలను తీసుకోవాలని తద్వారా కలిగే ప్రయోజనాలను ఉగ్ర వివరించారు. సమావేశంలో టీడీపీ వెలిగండ్ల మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, సలోమన్రాజు, గోనా ప్రతాప్, ఇంద్రభూపాల్రెడ్డి, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.