సుప్రీంకి వెళ్తాం: కేంద్రం నిర్ణయంపై పంజాబ్ సీఎం చన్నీ

ABN , First Publish Date - 2021-10-25T23:45:37+05:30 IST

పంజాబీలు ఈ నిర్ణయాన్ని స్వాగతించరని, వారికి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. పంజాబ్‌లోని అన్ని పార్టీలతో కలిసి ఈ విషయమై ఆందోళన నిర్వహిస్తాయి. కేంద్రానికి అనేక ప్రతిపాదనలు చేశాం..

సుప్రీంకి వెళ్తాం: కేంద్రం నిర్ణయంపై పంజాబ్ సీఎం చన్నీ

చండీగఢ్: పంజాబ్ సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల లోపలకి వచ్చి కార్యకలాపాలు నిర్వహించేలా భారత సరిహద్దు రక్షణా దళాలకు (బీఎస్‌ఎఫ్) అధికారం ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ఆయన.. కేంద్రానికి పలుమార్లు ఈ విషయమై ప్రతిపాదనలు చేశారు. అయితే చన్నీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు.


ఈ విషయమై చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో చన్నీ మాట్లాడుతూ ‘‘పంజాబీలు ఈ నిర్ణయాన్ని స్వాగతించరని, వారికి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. పంజాబ్‌లోని అన్ని పార్టీలతో కలిసి ఈ విషయమై ఆందోళన నిర్వహిస్తాయి. కేంద్రానికి అనేక ప్రతిపాదనలు చేశాం. కానీ మా మాటను వాళ్లు పరిగణలోకి తీసుకోలేదు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది. అలాంటివి కొనసాగనివ్వం. ఈ విషయమై మేము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం’’ అని అన్నారు.

Updated Date - 2021-10-25T23:45:37+05:30 IST