గ్రామ స్వరాజ్య సాధనలో భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2022-08-15T05:01:04+05:30 IST
గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనలో కళాకారులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే, సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు.
- ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
కరీంనగర్ కల్చరల్, ఆగస్టు 14: గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనలో కళాకారులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే, సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. ఆదివారం సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద కళాకారుల ప్రదర్శనను అమరవీరుల స్తూపం వద్ద ప్రారంభించారు. అనంతరం వివిధ కళాకారులు కలెక్టరేట్ ఆడిటోరియం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆడిటోరియంలో నిర్వహించిన ప్రదర్శనలను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని వజ్రోత్సవాన్ని కళల ద్వారా చాటిచెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల ఫలితాన్ని మనం అనుభవిస్తున్నామని, వారి మార్గంలో అందరం నడవాలన్నారు. తెలంగాణ సాధన కోసం అసువులు బాసిన అమరవీరులను గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణలో మాత్రమే 570 మంది కళాకారులకు ఉద్యోగం కల్పించి ప్రభుత్వంలో భాగస్వాములను చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్లాల్, సీపీ సత్యనారాయణ, ప్రణాళిక అధికారి కొమురయ్య, మెప్మా పీడీ రవీందర్, డీడీ అబ్దుల్ కలీం, యువజన, క్రీడాధికారి రాజవీరు, మార్కెటింగ్ డీడీ పద్మావతి, గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, నెహ్రూ యువ కేంద్ర కో ఆర్డినేటర్ రాంబాబు, మైనార్టీ సంక్షేమాధికారి మధుసూదన్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.