అసమానతలు తొలగించే ఆర్థిక వ్యవస్థ కావాలి: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-08-14T08:39:28+05:30 IST
‘‘టీడీపీ పాలసీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. టీడీపీ దేశ అభివృద్ధిలో భాగస్వామిగా ఉంది.
ఎన్టీఆర్ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరణ
హైదరాబాద్, అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ‘‘టీడీపీ పాలసీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. టీడీపీ దేశ అభివృద్ధిలో భాగస్వామిగా ఉంది. రాజకీయ నాయకులు ప్రభుత్వాలలో ఉండి తీసుకువచ్చే పాలసీలు ప్రజల జీవితాలను మార్చాలి. దేశంలో అసమానతలు తొలగించే ఆర్థిక వ్యవస్థ కావాలి. ఇందుకోసం పార్టీలు పాలసీలు మార్చుకోవాలి’’ అని మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా శనివారం, ఎన్టీఆర్ భవన్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. హర్ ఘర్ తిరంగా ఒక మంచి కార్యక్రమమన్నారు. ఇప్పుడు గర్వంగా జెండా చేతపట్టుకుని తిరుగుతున్నాం అంటే ఎందరో చేసిన త్యాగాలే కారణమన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ నుంచి కొమరం భీం వరకు అందరినీ స్మరించుకుందామన్నారు. నేషన్ ఫస్ట్ నినాదాన్ని గట్టిగా వినిపిద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింలు, రాష్ట్ర సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్రావు, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డి, అరవింద్గౌడ్, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.