ట్రంప్ ట్వీట్‌పై స్పందించిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్

ABN , First Publish Date - 2020-03-30T23:50:34+05:30 IST

బ్రిటన్ ప్రిన్స్‌ హ్యారీ, మేఘ‌న్ మార్కెల్‌ దంప‌తుల భద్రత ఖర్చులను అమెరికా ప్రభుత్వం భరించదంటూ ట్రంప్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్వీట్‌పై

ట్రంప్ ట్వీట్‌పై స్పందించిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్

వాషింగ్టన్: బ్రిటన్ ప్రిన్స్‌ హ్యారీ, మేఘ‌న్ మార్కెల్‌ దంప‌తుల భద్రత ఖర్చులను అమెరికా ప్రభుత్వం భరించదంటూ ట్రంప్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్వీట్‌పై ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ స్పందించారు. తమ భద్రతకు సంబంధించిన ఖర్చులను  అమెరికా ప్రభుత్వాన్ని అడిగే ఆలోచన తమకు లేదంటూ ఈ జంట ప్రకటించింది. ప్రైవేటు నిధులతో భద్రతను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. కాగా.. ‘‘బ్రిటన్ రాణి నాకు మంచి స్నేహితురాలు. బ్రిటన్ అంటే నాకు చాలా ఇష్టం. రాజ కుటుంబాన్ని వీడిన హ్యారీ, మేఘన్ కెనడాలో శాశ్వతంగా నివసిస్తారని కొద్ది రోజుల క్రితం విన్నాం. ఇప్పుడు వారు కెనడాను వీడి అమెరికా వచ్చారు. అయితే వారి భద్రత ఖర్చులను అమెరికా భరించదు. వారే తప్పక చెల్లించాలి’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ట్రంప్ ఇలా ట్వీట్ చేయడానికి అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. 2016లో అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల ప్రచార సమయంలో.. ప్రిన్స్ హ్యారీ ట్రంప్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఈ కారణంగానే ట్రంప్ ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నట్టు అర్థమవుతోంది.


కాగా.. క్వీన్ ఎలిజబెత్-2 మనవడైన హ్యారీ... అమెరికా నటి మేఘన్ మార్కెల్‌ను పెళ్లాడారు. రాజగృహం విండ్సర్ కాజిల్ వేదికగా 2018లో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. జనవరిలో తమకు ఆర్ధిక స్వాతంత్ర్యం కావాలంటూ రాజ కుటుంబం నుంచి విడిపోయిన ఈ జంట నార్త్ అమెరికాకు మకాం మార్చింది. మార్చి చివరి నాటికి అధికారికంగా వీరు రాజకుటుంబం నుంచి వేరుపడతారు. గతేడాది చివరి నుంచి హ్యారీ, మేఘన్‌లిద్దరూ కెనడాలోని వాంకోవర్ ద్వీపంలో ఉంటూ వచ్చారు. అయితే రాజకుటుంబం నుంచి వేరుపడిన తర్వాత ఈ దంపతులకు తాము భద్రతా ఖర్చులు చెల్లించబోమని గత నెలలో కెనడా ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2020-03-30T23:50:34+05:30 IST