వైద్యరంగంలో అద్భుతాలు చేస్తున్నాం...
ABN , First Publish Date - 2022-10-02T06:24:47+05:30 IST
వైద్యరంగంలో అద్భుతాలు చేస్తున్నాం...
119 నియోజకవర్గాల్లో హెల్త్ ప్రొఫైల్ చేపడతాం
ములుగులో త్వరలో డయాలసిస్ సెంటర్
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి గొప్ప మైలురాయి అవుతుంది..
చికిత్స కోసం హైదరాబాద్కు పోవాల్సిన అవసరం ఉండదు...
హైదరాబాద్ నుంచే వరంగల్కు వస్తారు...
ప్రతిమ ఆస్పత్రి, వైద్యకళాశాల ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్
ఓరుగల్లు, అక్టోబర్ 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వరంగల్లో 2 వేల పడకల సూపర్ స్పెషాలిటీ అస్పత్రి నిర్మిస్తున్నామని, అది పూర్తయితే చికిత్స కోసం ప్రజలు హైదరాబాద్కు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్ ప్రజలే వైద్యం కోసం వరంగల్ కు రావలసిన పరిస్థితి ఏర్పడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. హనుమకొండజిల్లా దామెర క్రాస్రోడ్డులో ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాల, ప్రతిమ కాన్సర్ ఆస్పత్రిని శనివారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు.
కేసీఆర్ గత ఉపన్యాసాలకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రులు... ఢిల్లీలో మాత్రం తెలంగాణకు అవార్డులు ఇస్తున్నారని ఎత్తిచూపారు. ఈ అంశం తప్ప కేంద్రంపై పెద్దగా విమర్శలు చేయలేదు. సావధానంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగిన తీరును వివరించారు. యవతను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. గతంలో ఎన్నడూ తన వయసు ప్రస్తావన తేని కేసీఆర్ ఈ సమావేశంలో తాను 68 సంవత్సరాల వయసు దాటుతున్నానని భారత దేశ భవితవ్యాన్ని మీరే చూసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.
ఒక వైపు గత 8 ఏళ్ళ కాలంలో జరిగిన రాష్ట్ర అభివృద్ధిని వివరిస్తూనే మరో వైపు భారతదేశంలో ఉన్న అపారమైన వనరులు, అవి ఉపయోగించబడని తీరును కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలను సాధించామన్నారు. సెంట్రల్ జైలును కూల్చి వేసి దాని ఆవరణలో రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నామన్నారు. ఏకంగా 24 అంతస్తులతో ఈ భవనం ఉంటుందన్నారు. దాన్ని ఎక్కి చూస్తే హైదరాబాద్ కనబడే పరిస్థితి ఉంటుందన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలో జిల్లాకు ఒకటి చొప్పున 33 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. ‘ప్రయోగాత్మకంగా సిరిసిల్ల, ములుగు నియోజకవర్గంలో 100 శాతం హెల్త్ ప్రొఫైల్ తయారు చేశాం... ఆ నియోజకవర్గాల పరిధిలోని ప్రతీ మనిషి ఆరోగ్యస్థితి గతులను రికార్డు చేశాం... ఏ రకమైన జబ్బు వచ్చినా బటన్ నొక్కితే మొత్తం వివరాలు తెలుస్తాయి... రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం... ములుగు జిల్లాలో ఒక డయాలసిస్ సెంటర్ త్వరలో ఏర్పాటు చేస్తాం..’ అని కేసీఆర్ వెల్లడించారు.
ముంబయి రాజధానిగా ఉన్న మహారాష్ట్ర కన్నా తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదల, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అగ్ర స్థానంలో ఉంది. కొందరు దుర్గార్గులు తమ స్వార్ధ, నీచ ప్రయోజనాల కోసం విషబీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారని కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు, మంత్రులు గంగుల కమలాకర్, దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపెల్లి వినోద్ కుమార్, ఎంపి పసునూరి దయాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, రెడ్యానాయక్, ముత్తిరెడ్డి యాదగిరి, గండ్ర రమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జిల్లా పరిషత్ చైర్మన్లు డాక్టర్ సుధీర్ బాబు, గండ్ర జ్యోతి, పాగాల సంపత్ రెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
‘కెప్టెన్’కు పరామర్శ
హనుమకొండ టౌన్, అక్టోబరు 1: ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావును ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. శనివారం ప్రతిమ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. హనుమకొండలోని కెప్టెన్ నివాసానికి వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హనుమంతు, గోపితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు కేసీఆర్ను కలిశారు. జాతీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన కేసీఆర్కు నేతలు మద్దతు ప్రకటించి శుభాకాంక్షలు తెలిపారు.
డిజైన్లో మార్పులెందుకు చేశారు..?
ఈఎన్సీ, ప్రాజెక్ట్ డైరెక్టర్లపై సీఎం అసహనం
సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి పనుల తీరుపై అసంతృప్తి
ఓరుగల్లు, అక్టోబర్ 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల తీరు పట్ల ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దామెర క్రాస్రోడ్డులో శనివారం ప్రతిమ మె డికల్ కాలేజీ, హాస్పిటల్కు ప్రారంభోత్సవం చేసిన అనంతరం సీఎం సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిని తని ఖీ చేశారు. అంతకుముందు ప్రతిమ క్యాన్సర్ హాస్పి టల్ ప్రారంభ కార్యక్రమంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి గురించి సీఎం గొప్పగా మాట్లాడారు.
వరంగల్లో నిర్మించే ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్ప త్రివల్ల హైదరాబాద్ నుంచే ప్రజలు చికిత్స కోసం వరంగల్కు వచ్చే పరిస్థితి వస్తుందన్నారు. వరంగల్ హాస్పిటల్ ఎక్కి చూస్తే ఏకంగా హైదరాబాద్ కనిపి స్తుందని గొప్పగా చెప్పారు. తీరా ముఖ్యమంత్రి ఆస్ప త్రిని సందర్శించగా అక్కడి పనులు చూసి అవాక్క య్యారు. తాను సూచించిన దానికంటే భిన్నంగా డిజై న్లు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నమూ నాలను వివరించేందుకు అక్కడ ఏర్పాటు చేసిన భారీ డిజైన్లను చూడగానే పక్కనే ఉన్న ఈఎన్సీ గణపతి రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట్ రెడ్డిల పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ డిజైన్ ఏంటి? నాకు చూపించిన డిజైన్కు భిన్నంగా వర్క్ జరగడం ఏంటి..? అని గణపతి రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఈవిషయమై తనతో చర్చించాలని ఆదేశించారు. తొలుత భవనాల నిర్మా ణం జరుగుతున్న స్థలంలో ఆస్పత్రి భవనాల నమూ నా, ప్లాన్లు, ఇప్పటివరకు జరిగిన పనులకు సంబం ధించిన ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సీఎం ఈ ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా రోడ్లు భ వనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ పనుల పురోగతిని సీఎంకు వివరించారు.