Nirmala Sitharaman : హిందీ మాట్లాడనివాళ్లు భారతీయులు కాదనే దేశభక్తులొద్దు

ABN , First Publish Date - 2022-09-17T20:54:33+05:30 IST

బ్యాంకు సిబ్బంది నియామకాల్లో సమ్మిళితత్వాన్ని ప్రదర్శించాలని, స్థానిక

Nirmala Sitharaman : హిందీ మాట్లాడనివాళ్లు భారతీయులు కాదనే దేశభక్తులొద్దు

న్యూఢిల్లీ : బ్యాంకు సిబ్బంది నియామకాల్లో సమ్మిళితత్వాన్ని ప్రదర్శించాలని, స్థానిక భాష మాట్లాడేవారిని నియమించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) పిలుపునిచ్చారు. బ్యాంకులు ఉన్నది వ్యాపారం చేయడం కోసమని, ప్రజల్లో ఓ రకమైన వాల్యూ సిస్టమ్‌ను పెంపొందించడానికి కాదని గుర్తు చేశారు. 


జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (Indian Banks' Association) 75వ వార్షిక సాధారణ సమావేశం ముంబైలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో నిర్మల సీతారామన్ మాట్లాడుతూ, ‘‘మీరున్నది వ్యాపారం చేయడానికి. ప్రజల్లో ఓ రకమైన వాల్యూ సిస్టమ్‌ను పెంపొందించడానికి కాదు’’ అన్నారు. స్థానిక భాష మాట్లాడేవారిని ఉద్యోగాల్లో చేర్చుకోవాలన్నారు. మన దేశంలో ఉన్న వైవిద్ధ్యభరితమైన పరిస్థితుల కారణంగా ఇది చాలా అవసరమన్నారు. 


ప్రాంతీయ భాషలో మాట్లాడకుండా, ‘ఓయ్, నువ్వు హిందీ మాట్లాడటం లేదు, నువ్వు భారతీయుడివి కాకపోవచ్చు’ అనే దేశభక్తులు బ్యాంకు శాఖల్లో ఉండటం, వ్యాపారానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. బ్రాంచీల్లో నియమితులైనవారి గురించి సమీక్షించాలని బ్యాంకులకు చెప్పారు. స్థానిక భాష మాట్లాడటం రానివాళ్ళకు కస్టమర్లతో నిర్వహించవలసిన వ్యవహారాలను అప్పగించవద్దని తెలిపారు. ఉద్యోగులను నియమించుకునేటపుడు దూరదృష్టితో వ్యవహరించాలన్నారు. 


‘‘మీకు సేవ చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని కస్టమర్లకు చెప్పాలన్నారు. చురుగ్గా వ్యవహరించాలని, కస్టమర్లు కోరిన చోటుకు వెళ్లి సేవలందించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. కస్టమర్లు చెప్పిన చోటుకు వెళ్లి, వ్యాపారం చేయాలన్నారు. అదే సమయంలో నియమ, నిబంధనలను సరైన విధంగా పాటించాలని తెలిపారు. 


Updated Date - 2022-09-17T20:54:33+05:30 IST