భారతీయ సందర్శకులకు ఐడీ కార్డుల విధానం తెస్తాం : నేపాల్ హోం మంత్రి
ABN , First Publish Date - 2020-08-13T01:56:01+05:30 IST
కోవిడ్-19 మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు అమలు
ఖాట్మండు : కోవిడ్-19 మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు అమలు చేస్తున్నామని నేపాల్ హోం మంత్రి రామ్ బహదూర్ థాపా చెప్పారు. భారత దేశం నుంచి నేపాల్ వచ్చేవారిని తమ గుర్తింపు కార్డులను చూపించాలని కోరుతామని చెప్పారు. ఈ వివరాలను పార్లమెంటరీ ప్యానెల్కు తెలిపారు.
రాజ్య నిర్వహణ, సుపరిపాలనపై పార్లమెంటరీ ప్యానెల్ సమక్షంలో హోం మంత్రి రామ్ బహదూర్ మాట్లాడుతూ, ప్రజల రాకపోకలు, కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన సమాచారం శాశ్వతంగా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ సిస్టమ్ వంటివాటిని అమలు చేస్తామని తెలిపారు. ఈ సమాచారం మెరుగైన రీతిలో నమోదయ్యేలా చూస్తామని చెప్పారు.
ఇదిలావుండగా, నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ ఇటీవల మాట్లాడుతూ, ఆ దేశంలో కోవిడ్-19 వ్యాపించడానికి కారణం భారత దేశమేనని ఆరోపించారు.
ఇప్పటి వరకు భారతీయులు నేపాల్లోకి నిరభ్యంతరంగా రాకపోకలు సాగిస్తున్నారు. నేపాల్ ఐడీ కార్డుల విధానాన్ని అమలు చేస్తే, ఈ రాకపోకలపై కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నట్లే భావించాలి.