ప్రజలపై కూడా దాడి చేస్తున్నాం... తల్లికి చెప్పిన రష్యన్ సైనికుడు...

ABN , First Publish Date - 2022-03-01T19:09:16+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొన్న ఓ రష్యన్ సైనికుడు తన తల్లికి

ప్రజలపై కూడా దాడి చేస్తున్నాం... తల్లికి చెప్పిన రష్యన్ సైనికుడు...

కీవ్ : ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొన్న ఓ రష్యన్ సైనికుడు తన తల్లికి పంపిన చిట్ట చివరి సందేశం అత్యంత హృదయవిదారకంగా ఉంది. తాము ఉక్రెయిన్‌లోని అన్ని నగరాలపై దాడి చేస్తున్నామని, సాధారణ ప్రజలపై కూడా బాంబులు వేస్తున్నామని, తనకు చాలా భయంగా ఉందని చెప్పాడు. ఈ యుద్ధంలో ఆ సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. 


‘‘అమ్మా నేను ఉక్రెయిన్‌లో ఉన్నాను. ఇక్కడ నిజమైన యుద్ధం జరుగుతోంది. నాకు చాలా భయంగా ఉంది. అన్ని నగరాలపైనా బాంబులు వేస్తున్నాం. సాధారణ ప్రజలను సైతం టార్గెట్ చేస్తున్నాం’’ అని ఆ రష్యన్ సైనికుడు తన తల్లికి సందేశం పంపించాడు. అంతకుముందు ఆయన తల్లి ఇచ్చిన సందేశంలో, ఎందుకు ఇంత ఆలస్యమైంది? పార్శిల్ పంపించమంటావా? అని అడిగింది. అందుకు ఆ సైనికుడు బదులిస్తూ, తాను ఉక్రెయిన్‌లో ఉన్నానని, ఉరి వేసుకుని చావాలని అనుకుంటున్నానని చెప్పాడు. 


ఉక్రెయినియన్లు తమకు స్వాగతం పలుకుతారని తమకు చెప్తున్నారని, అయితే వారు తమ సాయుధ వాహనాల క్రింద పడుతున్నారని, తమను ముందుకు సాగనివ్వడం లేదని చెప్పాడు. వారు తమను ఫాసిస్టులంటున్నారన్నారు. ‘అమ్మా, ఇది చాలా కఠినంగా ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. 


ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అత్యవసర సమావేశంలో ఐరాసకు ఉక్రెయిన్ రాయబారి ఈ సందేశాలను చదివి వినిపించారు. ఫిబ్రవరి 24న తమ దేశంపై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత ఎంత విస్తృతంగా విషాదం అలముకుందో గమనించాలని కోరారు. 


ఇదిలావుండగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా సైనికులకు ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఉక్రెయిన్ నుంచి వెళ్ళిపోవాలని కోరుతున్నారు. 


Updated Date - 2022-03-01T19:09:16+05:30 IST