Nirmala Sitharaman: ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్‌కు నిర్మలమ్మ స్ట్రాంగ్ కౌంటర్

ABN , First Publish Date - 2022-08-02T02:09:47+05:30 IST

చాలా దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ భేషుగ్గా ఉందని, వేగంగా అభివృద్ధి చెందుతున్నఆర్థిక వ్యవస్థల్లో

Nirmala Sitharaman: ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్‌కు నిర్మలమ్మ స్ట్రాంగ్ కౌంటర్

న్యూఢిల్లీ: చాలా దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ భేషుగ్గా ఉందని, వేగంగా అభివృద్ధి చెందుతున్నఆర్థిక వ్యవస్థల్లో మనది కూడా ఒకటని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అన్నారు. లోక్‌సభలో అధీర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury) ప్రశ్నకు బదులిస్తూ నిర్మల ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘ఇండియా మాద్యంలోకి, స్టాగ్‌ఫ్లేషన్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు. దేశంలో మాంద్యం వచ్చేందుకు సున్నా అవకాశాలు మాత్రమే ఉన్నాయని బ్లూమ్‌బర్గ్ సర్వే కూడా పేర్కొంది’’ అని నిర్మల తెలిపారు. ఇది నిజానికి డేటా ఆధారిత చర్చ కంటే రాజకీయ అంశంపై చర్చ అని అన్నారు. దాదాపు 30 మంది సభ్యులు ధరల పెరుగుదల గురించి మాట్లాడారని, చాలా మంది గణాంకాల ఆధారిత ఆందోళనల కంటే రాజకీయ కోణాలను లేవనెత్తారని నిర్మల విమర్శించారు. 


ధరల పెరుగుదలపై విపక్షాలు వారాలపాటు సమావేశాలకు అంతరాయం కలిగించిన తర్వాత నేడు(సోమవారం) పార్లమెంటులో ధరలపై చర్చ జరిగింది. సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆమె లోక్‌సభలో మాట్లాడారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మనం నిలబడగలుగుతున్నామని, ఈ విషయంలో ఆ ఘనత అంతా ప్రజలకే చెందుతుందని అన్నారు. మనం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందగలుగుతున్నామని పేర్కొన్నారు.


రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.  ద్రవ్యోల్బణం దారుణంగా పెరిగిపోతోందన్న కాంగ్రెస్ విమర్శలకు మంత్రి బదులిస్తూ.. యూపీఏ(UPA) ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం ఏకంగా 9 సార్లు రెండంకెలకు చేరుకున్నట్టు చెప్పారు. యూపీఏ హయాంలో 22 నెలలపాటు ద్రవ్యోల్బణం 9 శాతానికి పైనే ఉన్నట్టు చెప్పారు.  

Updated Date - 2022-08-02T02:09:47+05:30 IST