అర్హతలున్నా అన్యాయంగా తొలగించారు

ABN , First Publish Date - 2021-06-20T07:09:28+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం 45 సంవత్సరాలు నిండిన అర్హులైన మహిళలకు మంజూరుచేసే జగనన్న చేయూత పథకం కొందరికి అందడంలేదు.

అర్హతలున్నా అన్యాయంగా తొలగించారు
ఎంపీడీవోకు సమస్యను వివరిస్తున్న లబ్ధిదారులు

 

దొనకొండ, జూన్‌ 19:  రాష్ట్ర ప్రభుత్వం 45 సంవత్సరాలు నిండిన అర్హులైన మహిళలకు మంజూరుచేసే జగనన్న చేయూత పథకం  కొందరికి అందడంలేదు. రాత్రికి రాత్రే మంజూరు జాబితాలో నుంచి తమ పేర్లు తొలగించారని కొచ్చెర్లకోటకు చెందిన పలువురు మహిళలు శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవోను చుట్టుముట్టారు. గ్రామానికి చెందిన వినుకొండపెద్దగాలెమ్మ, వినుకొండ రాహేలమ్మ, రాచేటి కమలమ్మ, చీరాల కొండమ్మ గతేడాది జగనన్న చేయూత పథకంలో నగదు పొందారు. ఈ ఏడాదినూ అర్హుల జాబితాలో వీరిపేర్లు నమోదయ్యాయి. లబ్ధిదారులు లాగిన్‌లో వారి వేలిముద్రలు వేస్తే పథకం మంజూరవుతుంది. జీవనోపాధి నిమిత్తం మామిడికాయల పనులకు  చిత్తూరు జిల్లా వెళ్లిన వీరు లాగిన్‌లో వేలి ముద్రలు వేసేందుకు అక్కడినుంచి ఒక్కొక్కరు రూ.వెయ్యి చార్జీ పెట్టుకొని శుక్రవారం గ్రామానికి వచ్చారు. అప్పటివరకు లాగిన్‌లో నమోదయి ఉన్న వీరిపేర్లు రాత్రికి రాత్రి లాగిన్‌ నుంచి తొలగించబడ్డాయి. దీంతో వారు మండల పరిషత్‌ కార్యాలయంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామంలో రాజకీయ గ్రూపుల కారణంగా అర్హులైన పేదప్రజలకు ప్రభుత్వ పథకాల మంజూరులో అన్యాయం జరుగుతుందని  వాపోయారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో కేజీఎస్‌ రాజు మాట్లాడుతూ పని ఒత్తిడితో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లాగిన్‌ను అందరికీ అందుబాటులోకి తేవటంతో సమస్య ఎదురైందన్నారు. ఈ విషయంపై పూర్తిస్ధాయిలో విచారణ చేపట్టి సమస్యను ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళతామన్నారు. అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2021-06-20T07:09:28+05:30 IST