జల్శక్తి అభియాన్ ద్వారా నీటి వనరులు పెంచాలి
ABN , First Publish Date - 2020-08-11T11:12:34+05:30 IST
జల్శక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా నీటి నిల్వల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ హరికిరణ్
కడప, (కలెక్టరేట్) ఆగస్టు 10 : జల్శక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా నీటి నిల్వల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చాంబరులో జల్శక్తి అభియాన్ జిల్లా సమన్వయ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీటి సంక్షోభాన్ని పరిష్కరించే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం జల్శక్తి అభియాన్ పేరిట దేశవ్యాప్తంగా నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. దానికి కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2019లో నీటి వనరుల పెంపు కోసం సమర్థవంతంగా చేపట్టిన కృషి వల్ల అప్పట్లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 250 జిల్లాల్లో కడప జిల్లాకు మొదటిస్థానం లభించిందని తెలిపారు.
డ్వామా ఆధ్వర్యంలో చేపట్టిన నీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. అదే స్ఫూర్తితోనే జల్శక్తి అభియాన్ ద్వారా జిల్లాలో నీటి వనరుల పెంపుదల, భూగర్భజలాల సంరక్షణ, నీటి వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ యదుభూషణ్రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ మధుసూదన్రెడ్డి, భూగర్భ జలశాఖ డీడీ మురళి, ఆర్డబ్ల్వుఎస్ ఎస్ఈ మల్లికార్జున, అగ్రికల్చర్ జేడీ మురళీకృష్ణ, డీఎస్వో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.