1908, సెప్టెంబర్‌ 28..సరిగ్గా ఇదే రోజున..

ABN , First Publish Date - 2022-09-28T16:36:09+05:30 IST

1908 సెప్టెంబర్‌, 26న నగరంలో చిరుజల్లులతో వాన మొదలైంది. తర్వాత రోజు సాయంత్రానికి వర్షం తీవ్రమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు వాన కురవసాగింది

1908, సెప్టెంబర్‌ 28..సరిగ్గా ఇదే రోజున..

భాగ్యనగరమంతా జలప్రవాహం.. 20 వేలకు పైగా ఇళ్లు నేలమట్టం.. వీధుల నిండా శరీరాల గుట్టలు.. నిలువనీడ లేక రోడ్డున పడ్డ జీవితాలెన్నో.. ఆ వరద బీభత్సం నగర చరిత్రలో అదొక మాయని గాయం. నాటి విషాదానికి 115 ఏళ్లు. 

హైదరాబాద్‌ సిటీ: 1908 సెప్టెంబర్‌, 26న  నగరంలో చిరుజల్లులతో వాన మొదలైంది. తర్వాత రోజు సాయంత్రానికి వర్షం తీవ్రమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు వాన కురవసాగింది. అప్పుడు 440 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తోంది. దాంతో చెరువులు కట్టలు తెంచుకున్నాయి. అప్పటికే నిండు కుండను తలపించిన మూసీ నదిలోకి ఆ నీరంతా చేరుతోంది. నగరం మధ్యన ప్రవహించే ఆ నది ఉగ్రరూపం దాల్చింది. భాగ్యనగరాన్ని వరద ముంచెత్తింది. అఫ్జల్‌గంజ్‌ వంతెన నేలమట్టమైంది. పాతనగరం నుంచి కోఠి రెసిడెన్సీ వరకు అంతా జలమయం. పేట్లబురుజూ ఆస్పత్రి, నాటి ఉస్మానియా ఆస్సత్రి భవనాలూ నేలకొరిగాయి. ఇరవై వేల ఇళ్లు కుప్పకూలాయి. కొన్ని రాజ ప్రసాదాలు సైతం నేలమట్టమయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆనాటి వరద బీభత్సం 15,000 మందిని పొట్టనపెట్టుకుంది. 80, 000 మంది నిరాశ్రయులయ్యారు. సుమారు ఇరువై కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. 


ఇప్పటికీ అదే కష్టం..

ఆనాటి విపత్తు మళ్లీ నగరంలో తలెత్తకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనతో ఆస్‌ఫజాహీలు హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ జలాశయాలను నిర్మించారు. అయితే, ఇవాల్టికి నగరం ఎంతో కొంత వరద కష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. చిన్నపాటి వర్షానికే కొన్ని ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. జన జీవనానికి ఇక్కట్లు తప్పని దయనీయ పరిస్థితి. నిరుడు వర్షాలకు సుమారు 1200 కాలనీలు నీటమునిగాయి. కొంత ప్రాణనష్టమూ తలెత్తింది. ఆనాటి గుణపాఠాలతో ప్రస్తుత పరిస్థితుల్లో వరద రహిత నగర నిర్మాణం కోసం అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-09-28T16:36:09+05:30 IST