సాగునీటి కాలువ కబ్జా
ABN , First Publish Date - 2022-06-29T04:36:50+05:30 IST
బుచ్చిరెడ్డిపాళెం శాంతినగర్లో నాగమాంబాపురం సాగునీటి కాలువను ఓ వ్యక్తి కబ్జా చేశాడు.
అధికారులకు స్థానికుల ఫిర్యాదు
బుచ్చిరెడ్డిపాళెం, జూన్ 28 : బుచ్చిరెడ్డిపాళెం శాంతినగర్లో నాగమాంబాపురం సాగునీటి కాలువను ఓ వ్యక్తి కబ్జా చేశాడు. కబ్జాదారుడు రెండ్రోజులుగా ఆక్రమించిన స్థలాన్ని గ్రావెల్తో చదును చేసి తాగునీటి కొళాయి కూడా ఏర్పాటు చేశాడు. 20నుంచి 30 అడుగులు ఉన్న కాలువ కబ్జాతో ఐదు అడుగులకు పరిమితమైంది. ఓ విశ్రాంత ఐఏఎస్ అఽధికారికి బంధువునని చెప్పి కబ్జా వ్యవహారానికి తెరలేపాడని స్థానికులు అంటున్నారు. వారు మంగళవారం స్థానిక గ్రామ పంచాయతీ అధికారితోపాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. వీఆర్వో, ఇరిగేషన్ అధికారులు ఒక్కొక్కరిగా వచ్చి పరిశీలించి వెళ్లారు. చర్యలు మాత్రం తీసుకోలేదు. కబ్జాదారుడే స్థానిక అంబేద్కర్నగర్లోని జొన్నవాడ సెంటర్ నుంచి రాజుపాళెం రోడ్డుకు వచ్చే మార్గంలో ఆంజనేయస్వామి గుడి వెనుక గతంలో రేబాల రైతులకు సాగునీరందించే ఓ కాలువను కూడా ఇదే తరహాలో కబ్జాచేసినట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కాలుతోపాటు పట్టణంలో కబ్జాలకు గురైన కాలువల కాపాడాలని రైతులు కోరుతున్నారు. కాలువ ఆక్రమణపై ఇరిగేషన్ డీఈఈ మధును వివరణ కోరగా బుధవారం చర్యలు చేపట్టి కాలువ స్థలంలో చదును చేసిన మట్టి తొలగిస్తామని తెలిపారు.