ఆక్రమణలతో కుచించుకు పోయిన పంట కాలువ

ABN , First Publish Date - 2021-04-13T05:35:06+05:30 IST

సాగర్‌ కాలువల నిర్వాహణ గురించి సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి.

ఆక్రమణలతో కుచించుకు పోయిన పంట కాలువ
దర్శి మైనర్‌ కాలువలో ప్రవహిస్తున్న మురికినీరు


దర్శి, ఏప్రిల్‌ 12 : సాగర్‌ కాలువల నిర్వాహణ గురించి సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. విలువైన స్ధలాలను ఆక్రమించుకుంటున్నప్పటికీ పట్టించుకున్న నాథుడు లేడు. దర్శి మైనర్‌ కాలువకు ఇరువైపుల కబ్జాచేసి విలువైన స్థలాన్ని తమ సొంత స్ధలాల్లో కలుపుకున్నారు. ఈ మైనర్‌ కాలువ దర్శి పట్టణం మధ్య నుంచి వెళుతోంది. ఆ ప్రాంతంలో సెంటువిలువ సుమారు రూ.10 లక్షలు ఉంది. కాలువ ఇరువైపుల కట్టలు 20 అడుగులు వెడల్పు ఉండాల్సిన కాలువ ప్రస్తుతం 8 అడుగులకు కుచించుకుపోయింది. కొన్నిచోట్ల మురికి కాల్వగా మారిపోయింది. కాల్వకు ఇరువైపుల నివాసం ఉంటున్న వారు మురికి నీటిని పైపుల ద్వారా నేరుగా కాల్వలోకి వదులుతున్నారు. చెత్తాచెదారం కూడా కాల్వలోకి పడేస్తున్నారు. దీని వలన పొలాలకు నీరు పారించుకుంటున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనలు వెదజల్లుతూ పొలాల్లోకి చేరుతుండటంతో ఆ నీటిని ఎలా వినియోగించుకోవాలో అర్ధంకాక ఇబ్బంది పడుతున్నారు. ఎన్‌ఎస్‌పీ అధికరారులు పరిస్థితి గమనించి ఆక్రమణలు తొలగించాలని మురికినీరు కాల్వలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-04-13T05:35:06+05:30 IST