డంపింగ్ యార్డులో చెత్త దహనం చేయొద్దు
ABN , First Publish Date - 2022-01-22T05:04:19+05:30 IST
డంపింగ్ యార్డులో చెత్తను తగలబెట్టడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని గోదావరి పరిరక్షణ ట్రస్ట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొవ్వూరు, జనవరి 21: డంపింగ్ యార్డులో చెత్తను తగలబెట్టడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని గోదావరి పరిరక్షణ ట్రస్ట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పాతరైలు వంతెన సమీపంలో కాటన్ విగ్రహం వద్ద పారబోసిన చెత్తకు నిత్యం నిప్పు పెట్టి మండిస్తున్నారు. చెత్తలో ప్లాస్టిక్, హానికరమైన రసాయనాలు మండి విషవాయువులు గాలిలో కలిసి పట్టణ వాసులు ఇబ్బంది పడుతున్నారు. చెత్త తగలబెడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, డంపింగ్ యార్డును తరలించాలని గోదావరి పరిరక్షణ ట్రస్ట్ సభ్యులు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ టి.రవికుమార్ను కోరారు. మంటలను ఆర్పేవరకు కార్యాలయం నుంచి వెళ్లేదిలేదని పట్టుబట్టడంతో కమిషనర్ వాటర్ ట్యాంకును పంపించి మంటలను అదుపుచేశారు. కొండపల్లి రత్నసాయి, కాకర్ల దొరబాబు, నూలు రాఘవేంద్ర, బొంతా శ్యాం, అనపర్తి శివుడు, వైకె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.