వసీం జాఫర్ ఆల్టైం వన్డే జట్టు.. ఇండియన్ బౌలర్లకు షాక్
ABN , First Publish Date - 2020-04-05T02:49:58+05:30 IST
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన ఆల్టైం వన్డే జట్టును శనివారం ప్రకటించాడు. ఇందులో
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన ఆల్టైం వన్డే జట్టును శనివారం ప్రకటించాడు. ఇందులో నలుగురు భారతీయులకు చోటు దక్కినప్పటికీ వారంతా బ్యాట్స్మెన్ కావడం గమనార్హం. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్తోపాటు ప్రస్తుత ఆటగాళ్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలకు చోటు కల్పించాడు. జాఫర్ తన జట్టుకు ధోనీని కెప్టెన్గా, వికెట్ కీపర్గా ఎంచుకున్నాడు. అలాగే, విండీస్ దిగ్గజ ఆటగాడు సర్ వివియన్ రిచర్డ్స్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్, 2019 ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్లను బ్యాటింగ్ లైనప్లోకి తీసుకున్నాడు.
ఆల్ రౌండర్లలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వాసిం అక్రంను ఎంచుకోగా, స్పిన్నర్లలో ఆసీస్ దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ను కానీ పాకిస్థాన్ బౌలర్ సక్లైన్ ముస్తాక్ను కానీ ఎంచుకోనున్నాడు. విండీస్ మాజీ సీమర్ జోయెల్ గార్నెర్, ఆస్ట్రేలియా లెజెండ్ గ్లెన్ మెక్గ్రాత్లను ఫాస్ట్ బౌలర్లుగా ఎంపిక చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారత్ నుంచి ఒక్కరంటే ఒక్క బౌలర్కు కూడా జాఫర్ చోటు కల్పించలేదు. ఇదే అనుకుంటే జాఫర్ ఇంకో షాక్ కూడా ఇచ్చాడు. ఆస్ట్రేలియాకు రెండుసార్లు ప్రపంచకప్ అందించిన రికీ పాంటింగ్కు చోటు కల్పించినప్పటికీ అతడిని 12వ ఆటగాడిగా ఎంచుకోవడం విశేషం.