దాహం తీరింది!

ABN , First Publish Date - 2020-03-08T09:59:30+05:30 IST

టీమిండియా మాజీ ఓపెనర్‌, ‘దేశీయ’ దిగ్గజం వసీం జాఫర్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు శనివారం గుడ్‌బై చెప్పాడు. 1996-97 సీజన్‌తో ప్రారంభమైన అతడి ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ దాదాపు 25 ఏళ్లపాటు ...

దాహం తీరింది!

క్రికెట్‌కు వసీం జాఫర్‌ అల్విదా

ముంబై: టీమిండియా మాజీ ఓపెనర్‌, ‘దేశీయ’ దిగ్గజం వసీం జాఫర్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు శనివారం గుడ్‌బై చెప్పాడు. 1996-97 సీజన్‌తో ప్రారంభమైన అతడి ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ దాదాపు 25 ఏళ్లపాటు సాగింది. ఈ క్రమంలో అతడు ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాడు. 42 ఏళ్ల జాఫర్‌ ప్రతిభ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌ అయిన జాఫర్‌ టెక్నిక్‌ దుర్భేద్యం. గంటలకొద్దీ క్రీజులో పాతుకుపోయి  బ్యాటింగ్‌ చేస్తూ శుభారంభాలు అందించడం వసీంకే చెల్లింది. ఎంతో సీనియర్‌ అయినా దరిచేరని గర్వం. చాలాకాలం కిందటే అంతర్జాతీయ క్రికెట్‌ ఆడినా ఇంకా దేశవాళీలో కొనసాగుతూ ఎందరో జూనియర్లకు మార్గదర్శనం చేయడం జాఫర్‌కే సాధ్యమైంది. రంజీల్లో కొనసాగుతూనే మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించడం క్రికెట్‌పట్ల అతడి నిబద్ధతకు నిదర్శనం.


ఆటగాడిగా రంజీట్రోఫీలో అతడి రికార్డులెన్నెన్నో. అత్యధిక మ్యాచ్‌లు (156), అత్యధిక పరుగులు (12,308), అత్యధిక సెంచరీలు (40), అత్యధిక క్యాచ్‌లు (200). ఇంకా దులీప్‌ ట్రోఫీలో అత్యధిక రన్స్‌ (2545), ఇరానీ కప్‌ (1294). అలాగే రంజీట్రోఫీలో రెండుసార్లు వేయి పరుగులు (2008-09, 2018-19) చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ కూడా జాఫరే. మొత్తం 10 సార్లు రంజీట్రోఫీ సాధించిన జట్టు సభ్యుడు. అందులో 8 సార్లు ముంబై తరపున అందుకున్నాడు. అందులో రెండుసార్లు ఆ జట్టుకు జాఫర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక విదర్భ తరపున రెండుసార్లు కప్‌ గెలిచాడు. మొత్తంగా 260 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 19,410 పరుగులు చేశాడు. 31 టెస్టులు ఆడిన జాఫర్‌ 34.11 సగటుతో 1944 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 11 అర్ధసెంచరీలున్నాయి. 212 అత్యధిక స్కోరు. రెండు వన్డేలు కూడా ఆడాడు. ‘క్రికెట్‌లో ఎన్నో ఏళ్ల పయనానికి స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైంది. కోచ్‌గా, వ్యాఖ్యాతగా మరేదైనా స్థాయిలో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని జాఫర్‌ అన్నాడు.  ఇటీవలే అతడు కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ సహాయ కోచ్‌గా నియమితుడయ్యాడు.

Updated Date - 2020-03-08T09:59:30+05:30 IST