అనంత ఇండస్ర్టియల్ ఎస్టేట్లో యథేచ్ఛగా అక్రమాలు..
ABN , First Publish Date - 2021-12-09T06:40:27+05:30 IST
నిబంధనలకు నీళ్లొదిలారు. అడిగేవారు లేరని ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలకు కేటాయించిన స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు కట్టేస్తున్నారు.
అడ్డుకునే వారేరీ..?
అయినా పట్టించుకోని దుస్థితి
పరిశ్రమల స్థలాలలో ఇళ్ల నిర్మాణాలు
ఏపీఐఐసీ కార్యాలయం వెనుక భాగంలోనే ఇష్టారాజ్యం
అనంతపురం ఇండసి్ట్రయల్ ఎస్టేట్లో నిబంధనలు గాలికి..
పరిశ్రమల మాటున నివాస భవనాలు
మామాళ్లతో పట్టించుకోని అధికారులు
ఓ సంస్థకు రూ.లక్షల్లో పన్ను చెల్లించకుండానే మ్యుటేషనకు ఓకే..?
వసూళ్లలో బిజీగా ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి
అనంతపురం కార్పొరేషన, డిసెంబరు 8: నిబంధనలకు నీళ్లొదిలారు. అడిగేవారు లేరని ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలకు కేటాయించిన స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు కట్టేస్తున్నారు. భవంతులు నిర్మిస్తున్నారు. అది ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరపాటే. జిల్లా కేంద్రంలోని బళ్లారి బైపాస్ సమీపాన గల ఇండసి్ట్రయల్ ఎస్టేట్లోని ఆంధ్రప్రదేశ ఇండస్ర్టియల్ ఇనఫ్రాస్ట్రక్షర్ కార్పొరేషన (ఏపీఐఐసీ) జిల్లా కార్యాలయం వెనకాలే కావడం గమనార్హం. రోజూ ఈ వ్యవహారాలను చూస్తున్న ఆ శాఖ ఉన్నతాధికారులు కాసుల కక్కుర్తితో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రం పరిధిలోనే ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో పరిశ్రమలకు ఇచ్చిన భూముల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, పరిశ్రమలు స్థాపింపజేసి వాటి ద్వారా ఉపాధి కల్పించాలనే ప్రభుత్వాల ఆకాంక్షలు ఇలాంటి వ్యవహారాలతో నెరవేరట్లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పరిశ్రమల పేరుతో నివాస భవనాలు
అనంతపురం నగరంలో బళ్లారి సమీపాన దాదాపు 59.05 ఎకరాల్లో ఇండస్ర్టియల్ ఎస్టేట్ ఉంది. అందులో 1983లో లేఔట్ అప్రూవల్తో ఎకరా, అర ఎకరా చొప్పున 74 ప్లాట్లు వేశారు. అందులో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. కొందరు పరిశ్రమల ముసుగులో ఇళ్లు నిర్మించేశారు. అధికారులను అమ్యామ్యాల మత్తులో పడేసి ప్రభుత్వాలకే డుమ్మా కొట్టారు. వాటి ముందుభాగంలోనే ఏపీఐఐసీ కార్యాలయం ఉంది. కార్యాలయం వెనుక భాగంలోనే ఏకంగా మూడు భవనాలు నిర్మించేశారు. ఐస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన ఓ పారిశ్రామికవేత్త వెనుకభాగంలోనే రెండంతస్తుల భవనం నిర్మించేశాడు. ట్రాన్సఫార్మర్ల(డీపీ) మరమ్మతు చేసే ఓ పర్రిశమ నిర్వాహకుడు సైతం అదేస్థాయిలో ఇల్లు కట్టాడు. బర్ఫీలు, టైల్స్ నిర్మించే మరో వ్యాపారవేత్త ఏకంగా భారీ భవనాన్ని నిర్మించేశాడు. ఇదే ముసుగులో మరికొందరు ఇలా వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఫ్యాక్టరీల వద్ద వాచమన తరహాలో చిన్నగది మాత్రమే నిర్మించి ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కూల్చివేతకు ఆదేశాలివ్వలేరా...?
పరిశ్రమలకు బదులుగా భవనాలు నిర్మించడం నిబంధనలకు విరుద్ధమని ఏపీఐఐసీ అధికారులందరికీ తెలుసు. కార్యాలయానికి కూతవేటు ధూరంలో ఇళ్లు వెలిసినా పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేంటనే ప్రశ్నకు సమాఽధానం లేదు. ఆ భవనాలు నిర్మించిన సమయంలో చర్యలు తీసుకోకుండా ఉండటానికి ఉన్నతాధికారులకు భారీగానే ముడుపులు అందినట్లు సమాచారం. నామ్కేవాస్తే నోటీసులిచ్చి, చేతులు దులిపేసుకుంటున్నారు. వాటి కూల్చివేతకు ఉత్తర్వులు ఇవ్వకపోవడంలోనే అధికారుల వైఖరి బయటపడుతోంది. ఏపీఐఐసీ చైర్మన కూడా జిల్లాలోనే ఉంటున్నారు.. బహుశా ఈ భవనాల విషయం ఆయన దృష్టికి రాలేదా...? వచ్చినా పట్టించుకోవడం లేదా...?
వసూళ్లలో బిజీగా ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి
ఏపీఐఐసీ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి పైసా వసూళ్లలో బిజీబిజీగా ఉంటున్నాడట. ఎంటర్ప్రెస్యూర్ రీసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) విభాగంలో పనిచేసే ఆ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ప్రతి పనికీ పైసలు ఇవ్వాల్సిందేనని సమాచారం. ఆనలైనలో అప్డేషనలో మ్యుటేషన, సబ్డివిజన్ల వ్యవహారాల్లో బాగానే వసూ లు చేస్తున్నట్లు సమాచారం. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ప్రాజెక్టు రిపోర్టు తప్పనిసరిగా ఉండాలి. అలాంటివి తన వద్దనే చేయించుకోవాలనే కొత్త రూల్ ను పెట్టి మరీ ముడుపులు పుచ్చుకుంటాడనే ఆ రోపణలు ఉన్నాయి. గతంలో ఆ ఉద్యోగిని అనధికార జేఎం గా పిలిచేవారని ఆ శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి.
పన్ను చెల్లించకుండానే మ్యుటేషనకు ఓకే..?
బళ్లారి బైపాస్ ప్రధాన రహదారిలోనే ఓ సంస్థకు పన్ను చెల్లించకుండానే మ్యుటేషనకు ఓకే చేయడానికి ఏపీఐఐసీ అధికారులు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఓ సంస్థకు ఓ ప్లాట్ను ఏపీఐఐసీ లీజుకిచ్చింది. ఆ తరువాత మరో మూడు కంపెనీల చేతులు మారింది. తాజాగా మరో సంస్థ ఆ లీజు దక్కించుకుంది. సబ్ డివిజన పేరుతో ఏపీఐఐసీకి పన్ను చెల్లించాల్సి ఉంది. ఆ తరువాతే సబ్ డివిజన ఆ సంస్థ పేరుతో పూర్తయినట్లుగా (మ్యుటేషన) అప్రూవల్ వస్తుంది. ఇందుకోసం రూ.లక్షల్లో పన్ను చెల్లించకుండానే ఆ ఫైల్ అప్రూవల్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.