సుబేదార్ చెరువులో హెచ్చరిక బోర్డు
ABN , First Publish Date - 2022-08-19T06:09:50+05:30 IST
ఎట్టకేలకు సుబేదార్ చెరువులో అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం ఆర్ఐ క్రిష్ణ ఆధ్వర్యంలో చెరువులో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.
కంబదూరు (కళ్యాణదుర్గం), ఆగస్టు 18 :
ఎట్టకేలకు సుబేదార్ చెరువులో అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం ఆర్ఐ క్రిష్ణ ఆధ్వర్యంలో చెరువులో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం ఈ చెరువును ఆరుగురు జిల్లా అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. దొడగట్ట ప్రాంతానికి చెందిన రైతులతో కూడా వివరాలు సేకరించారు. దీంతో ప్రత్యేక అధికారుల కమిటీ తుది నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేయడంతో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కళ్యాణదుర్గం గ్రామ పొలం సర్వే నెంబర్ 329లో 92.81 ఎకరాలను కొందరు ఆక్రమిస్తుండటంతో ఆ భూమిని రక్షించాలంటూ హైకోర్టులో పిల్ వేశారు. దీంతో కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకూ ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు కాని, అభివృద్ధి పనులు చేపట్టరాదని హెచ్చరిస్తూ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ షరతులను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సుబేదార్ చెరువు ఆక్రమణకు గురికాకుండా టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు పోరాటం సాగించాడు. కోర్టులో కూడా పిల్ వేశాడు.ఆయన పోరాట ఫలితంగానే అధికారులు కదలివచ్చారని రైతులు అంటున్నారు.