రెండు రోజుల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ

ABN , First Publish Date - 2022-05-27T17:14:27+05:30 IST

సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేరకు బీబీఎంపీ వార్డుల పునర్విభజన రెండు రోజుల్లో, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను 8 వారాల్లోపే పూర్తిచేస్తామని చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌

రెండు రోజుల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ

               - బీబీఎంపీ చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌ 


బెంగళూరు: సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేరకు బీబీఎంపీ వార్డుల పునర్విభజన రెండు రోజుల్లో, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను 8 వారాల్లోపే పూర్తిచేస్తామని చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌ గిరినాధ్‌ ప్రకటించారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలుత వార్డుల పునర్విభజన చేపట్టామని ఇది రెండు రోజుల్లోగా పూర్తి కానుందన్నారు. దీనికి ప్రభుత్వ ఆమోదం ల భించిన తర్వాత ప్రజలు తమ అభ్యంతరాలు తెలిపేందుకు రెండు వారాల సమయం ఉంటుందన్నారు. ఆపై వారం అవధిలో మొత్తం 243 వార్డుల జాబితాను వెల్లడిస్తామన్నారు. కాగా ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి 1992 నుంచి ఎన్నికైన కార్పోరేటర్లు ఏయే కులానికి చెందిన వారు అనే సమాచారాన్ని రెండు రోజుల్లో భక్తవత్సల కమిటీకి సమర్పిస్తామన్నారు. కొత్తగా బీబీఎంపీలో చేరబోతున్న 45 వార్డులకు ప్రత్యేక పేర్లను కూడా ప్రకటిస్తామన్నారు. 2011 జనసంఖ్య ఆధారంగా వార్డుల పునర్‌ విభజన ప్రక్రియ చేపట్టామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం గా చెప్పారు. ప్రతి వార్డులోనూ 35వేల జనాభా ఉండేలా చూస్తామన్నారు. కాగా బీబీఎంపీలో కార్పోరేటర్ల సంఖ్య 198 నుంచి 243కు పెరుగుతున్న నేపధ్యంలో ఇందుకు అనుగుణంగా బీబీఎంపీ సభాభవనాన్ని విస్తరించి ఆధునికీకకరిస్తున్నామన్నారు. నగర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ప్రత్యేక ఆసనాలు ఉంటాయన్నారు. ఇదిలా ఉండగా ఫిక్స్‌ మై స్ట్రీట్‌ ద్వారా రహదారులపై ఇంతవరకు 10 వేల గుంతలను గుర్తించామని ఇందులో తొలి దశలో 5,500 గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చే చర్యలు చేపట్టామని పది రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు.

Updated Date - 2022-05-27T17:14:27+05:30 IST