చోరీ చేద్దామనుకున్నారు.. మద్యం తాగుతూ పట్టుబడ్డారు

ABN , First Publish Date - 2022-01-21T06:52:41+05:30 IST

ఓ కిరాణా దుకాణంలో చోరీ చేద్దామని అర్ధరాత్రి సమయంలో వెళ్లిన నలుగురు యువకులు మద్యం తాగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

చోరీ చేద్దామనుకున్నారు.. మద్యం తాగుతూ పట్టుబడ్డారు

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో ఘటన

మద్దిరాల, జనవరి 20: ఓ కిరాణా దుకాణంలో చోరీ చేద్దామని అర్ధరాత్రి సమయంలో వెళ్లిన నలుగురు యువకులు మద్యం తాగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మండలంలోని రామచంద్రాపురం స్టేజి సమీపంలో కొమ్ము లింగయ్య అనే కిరాణా వ్యాపారి బెల్ట్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు కిరాణా దుకాణంలో దొంగతనం చేసేందుకు బయట ఉన్న తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడే ఉన్న మద్యం సీసాలను చూసి వచ్చిన పని మర్చిపోయారు. పూటుగా మద్యం తాగారు. కిరాణా దుకాణం బయట ద్విచక్రవాహనం పార్క్‌ చేసి ఉండటంతో పెట్రోలింగ్‌ పోలీసులకు అనుమానం వచ్చింది. దుకాణాన్ని పరిశీలించగా తాళం ధ్వంసం చేసి ఉంది. లోపలికి వెళ్లగా నలుగురు యువకులు మద్యం తాగుతూ కనిపించటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఆ నలుగురూ సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చినట్లు సమాచారం. తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారని కిరాణా షాపు యజమాని కొమ్ము లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ నాగయ్య తెలిపారు.


Updated Date - 2022-01-21T06:52:41+05:30 IST