వేతన సవరణ అమలు చేయాలి: ఎస్టీయూ
ABN , First Publish Date - 2021-07-26T05:11:57+05:30 IST
ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల వేతన సవరణను 55 శాతం ఫిట్మెంట్తో తక్షణమే అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర సహాధ్యక్షుడు హెచ్.తిమ్మన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.గోకారి డిమాండ్ చేశారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), జూలై 25: ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల వేతన సవరణను 55 శాతం ఫిట్మెంట్తో తక్షణమే అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర సహాధ్యక్షుడు హెచ్.తిమ్మన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.గోకారి డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని సలాంఖాన్ ఎస్టీయూ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా ఉపాధ్యక్షుడు వైవీ భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ పీఆర్సీ-2018 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలన్నారు. ఇప్పటికే పీఆర్సీ 2018 మూడు సంవత్సరాలు ఆలస్యమైందన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి ఏడు విడతల కరువు భత్యాలను ఇవ్వాలన్నారు. జాతీయ విద్యావిధానంలో 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లోనే కొనసాగించాలన్నారు. ఉపాధ్యాయుల నెలవారి పదోన్నతులు చేపట్టాలన్నారు. ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. కస్తూర్బా పాఠశాలలకు సర్వీసు నిబంధనలు వర్తింపజేయాలన్నారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ నాయకులు శేఖర్, వైవీ రాముడు, గోవింద్, ముదసీర్, అహ్మద్, హకీం తదితరులు పాల్గొన్నారు.