పైడిమాంబ పండుగకు శ్రీకారం
ABN , First Publish Date - 2020-10-02T09:43:57+05:30 IST
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లమ్మ తల్లి సిరిమానోత్సవ పండుగకు శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు.
నేడు చదురు, వనంగుడుల్లో పందిరి రాట
అర్ధమండల దీక్షలు ప్రారంభం
(విజయనగరం రూరల్) :
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లమ్మ తల్లి సిరిమానోత్సవ పండుగకు శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న వనంగుడి, మూడు లాంతర్ల వద్దనున్న చదురుగుడి వద్ద పండుగకు నాందిగా భావించే పందిరిరాట వేసే కార్యక్రమం చేపట్టనున్నారు. వేదమంత్రోచ్ఛారణలు.. మేళతాళాల మధ్య ఉదయం 8.45 గంటలకు చదురుగుడి వద్ద, 9.45 గంటలకు వనంగుడి వద్ద పందిరాట వేస్తారు. ఆలయ ఈవో జీవీఎస్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి అర్చకులు, సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు అందాయి.
ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు తదితరులు పైడిమాంబకు పూజలు నిర్వహించిన అనంతరం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత సిరిమానుకు ఉపయోగించే చెట్టు గుర్తింపు, విజయనగరం తీసుకువచ్చే కార్యక్రమం ఉంటాయి. హుకుంపేటకు తీసుకువెళ్లి సిరిమానుగా మలిచే కార్యక్రమాలు ఒక్కొక్కటిగా జరగనున్నాయి. దసరా పండుగ మరునాడే పైడిమాంబ సిరిమానోత్సవం ఆరంభం కానుండడంతో విజయనగరానికి వరుసగా రెండు పండుగలు రాబోతున్నాయి.
అర్ధ మండల దీక్షలు ప్రారంభం
పైడిమాంబ పండుగను పురస్కరించుకుని పందిరాట వేసే రోజు నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభం కానున్నాయి. అమ్మవారి భక్తులు మాలధారణ చేసి ఉయ్యాల కంబాల అనంతరం జరిగే చండీహోమం వరకూ దీక్ష కొనసాగిస్తారు.