మరో అడుగు
ABN , First Publish Date - 2020-10-01T11:17:40+05:30 IST
పార్వతీపురంలో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి కీలక అడుగు పడింది. నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
త్వరలోనే పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి
నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
రూ. 49.26 కోట్లు కేటాయింపు
(పార్వతీపురం):
పార్వతీపురంలో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి కీలక అడుగు పడింది. నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల కిందటే జీవో ఇస్తూ రూ.49.26కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆస్పత్రి నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అన్ని గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్రంలో ఐదు ఐటీడీఏల పరిధిలో ఆస్పత్రుల నిర్మాణం ప్రారంభించనుంది. సబ్ప్లాన్ మండలాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పార్వతీపురం కేంద్రంగా ఆసుపత్రిని నిర్మించనున్నారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, సాలూరు, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం సబ్ప్లాన్ మండలాల ప్రజలతో పాటు పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు తదితర పట్టణాల ప్రజలకు ఈ ఆసుపత్రి ద్వారా వైద్యసదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. పార్వతీపురం ఏరియా ఆసుపత్రి త్వరలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారనుంది. ఏరియా ఆసుపత్రికి ఎదురుగా ఉన్న స్థలంలోనే నూతన ఆసుపత్రి నిర్మాణం ప్రారంభంకానుంది. ఈమేరకు ఇటీవల రాష్ట్ర మంత్రులు స్థలాన్ని ఎంపిక చేశారు.