రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేయనున్న వీవీఎస్ లక్ష్మణ్

ABN , First Publish Date - 2021-11-14T21:41:20+05:30 IST

బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ టీమిండియా..

రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేయనున్న వీవీఎస్ లక్ష్మణ్

న్యూఢిల్లీ: బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపిక కావడంతో ఎన్‌సీఏ హెడ్ పదవి ఖాళీ అయింది. దీంతో ఆ ఖాళీని భర్తీ చేసేందుకు బీసీసీఐ ప్రయత్నాలు ప్రారంభించింది.


రాహుల్ ద్రవిడ్‌లా ఎన్‌సీఏను విజయవంతంగా నడిపే వ్యక్తి కోసం గాలిస్తున్న బోర్డు మాజీ క్రికెటర్, హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్‌తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమిక చర్యలు పూర్తయ్యాయని సమాచారం. తొలుత బీసీసీఐ ప్రతిపాదనను తిరస్కరించిన లక్ష్మణ్.. పలుమార్లు జరిగిన చర్చల తర్వాత అంగీకరించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేస్తుందని చెబుతున్నారు.


లక్ష్మణ్ ప్రస్తుతం బెంగాల్ దేశవాళీ క్రికెట్‌కు కన్సల్టెంట్‌గా ఉన్నాడు. అలాగే, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టుకు మెంటార్‌గానూ వ్యవహరిస్తున్నాడు. 46 ఏళ్ల లక్ష్మణ్ భారత అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా రికార్డులకెక్కాడు. 134 మ్యాచుల్లో 17 సెంచరీలతో 8,781 పరుగులు చేశాడు.  


Updated Date - 2021-11-14T21:41:20+05:30 IST