ఒక్కటి నిర్మిస్తే ఒట్టే..!

ABN , First Publish Date - 2022-06-11T05:15:37+05:30 IST

జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత పోటీ పరీక్షల్లో రాణించేందుకు డిజిటల్‌ లైబ్రరీలు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వం భావించింది.

ఒక్కటి నిర్మిస్తే ఒట్టే..!

ఊసేలేని డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం

స్థలాల కేటాయింపునకే పరిమితం

ఆసక్తి చూపని పంచాయతీ రాజ్‌

 


సంగంలో డిజిటల్‌ లైబ్రరీ నిర్మాణానికి కేటాయించిన స్థలమిది. నెలలు గడుస్తున్నా భవన నిర్మాణానికి కనీసం పునాది కూడా పడలేదు. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. పంచాయతీకి ఒక డిజిటల్‌ లైబ్రరీ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే ఒక్కటి నిర్మిస్తే ఒట్టే. ఇది జిల్లాలో వైఎస్‌ఆర్‌ డిజిటల్‌ లైబ్రరీల పరిస్థితి. 


సంగం, జూన్‌ 10 : జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత పోటీ పరీక్షల్లో రాణించేందుకు డిజిటల్‌ లైబ్రరీలు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ మేరకు ప్రతి పంచాయతీలో ఒక డిజిటల్‌ లైబ్రరీకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 2021 -22 ఏడాదికి మొదటి విడతగా జిల్లాలోని సగం పంచాయతీలకు డిజిటల్‌ లైబ్రరీలు మంజూరు చేసింది. ఒక్కో లైబ్రరీ నిర్మాణానికి ఉపాధి హామీ నిధుల్లో రూ. 15 లక్షలు కేటాయించింది. నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీటికి వైఎస్‌ఆర్‌ డిజిటల్‌ లైబ్రరీలుగా పేరు మార్చి నిర్మించాలని భావించింది.  


 స్థలాలు కేటాయింపునకే పరిమితం

ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్న పంచాయతీల్లో 4 సెంట్ల చొప్పున స్థలాలను ఎంపికచేసి పంచాయతీరాజ్‌శాఖకు అప్పగించారు. ఏడాది గడిచినా నిర్మాణాల పట్ల ఆ శాఖ అధికారులు ఆసక్తి చూపలేదు. పేరుకు మొక్కుబడిగా ఒకటి రెండు చోట్ల పునాధులు ప్రారంభించి వదిలేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తీరే కారణమని మిమర్శలు వినవస్తున్నాయి. 


డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణానికి గ్రహణం

కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన తరువాత సుమారు నాలుగు నెలలపాటు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణ పనుల గురించి ఆలోచించకపోవడంతో వీటి నిర్మాణానికి గ్రహణం పట్టింది. ఏ నిర్మాణాలు చేపట్టినా బిల్లులు అంతంతమాత్రమే విడుదలవుతుండటంతో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పట్టించుకోలేదు. 


ఒక్కటి నిర్మిస్తే ఒట్టే

రాష్ట్ర ప్రభుత్వ తీరు, పంచాయతీరాజ్‌ శాఖ నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో వైఎస్‌ఆర్‌ డిజిటల్‌ లైబ్రరీ ఒక్కటి నిర్మిస్తే ఒట్టే. ఈ నేపథ్యంలో నిర్మాణ సామగ్రి ఇసుక, సిమెంట్‌, స్టీల్‌తోపాటు కూలీల ధరలు పెరగడంతో డిజిటల్‌ లైబ్రరీ నిర్మాణాల సంగతే అధికారులు మరిచిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆసక్తి చూపకపోవడంతో జిల్లాలో డిజిటల్‌ లైబ్రరీల ఊసేలేదు. 

Updated Date - 2022-06-11T05:15:37+05:30 IST