విద్యతోనే ఉజ్వల భవిష్యత్
ABN , First Publish Date - 2022-06-26T04:08:13+05:30 IST
విద్యతోనే ఉజ్వల భవిష్యత్ సాధ్యమనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి పిల్లలను పాఠశాలలకు పంపి వారి భవిష్యత్కు బాటలు వేయాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సుందరవల్లి కోరారు.
వీఎస్యూ ఉపకులపతి సుందరవల్లి
వెంకటాచలం, జూన్ 25: విద్యతోనే ఉజ్వల భవిష్యత్ సాధ్యమనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి పిల్లలను పాఠశాలలకు పంపి వారి భవిష్యత్కు బాటలు వేయాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సుందరవల్లి కోరారు. మండలంలోని గంగిరెద్దుల కాలనీలో సెమ్కార్బ్ సౌజన్యంతో యూనివర్సిటీ సోషల్ విభాగం ఆధ్వర్యంలో గ్రామీణ శిబిరంలో భాగంగా శనివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. 150 మందికి బీపీ, షుగర్ పరీక్షలతో పాటు సాధారణ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థులు నాలుగు గోడలకే పరిమితం కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం రిజిస్ర్టార్ డాక్టర్ ఎల్. విజయకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో వలసల నివారణకు యూనివర్సిటీ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల ద్వారా, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయత్నాలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ విభాగం అధిపతి డాక్టర్ ఆర్ మధుమతి, సర్పంచు సుగుణమ్మ, ఎంపీటీసీ సభ్యులు శివ, కార్యదర్శి హరిప్రసాద్ రెడ్డి, సోషల్ వర్క్ అధ్యాపకులు డాక్టర్ సుబ్బరాజు, డాక్టర్ కుసుమ, డాక్టర్ బీవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.