వీఎస్‌యూ డిగ్రీ, పీజీ పరీక్షల ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-03T04:37:52+05:30 IST

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలల్లో గురువారం నుంచి డిగ్రీ రెండవ సెమిస్టర్‌, పీజీ పరీక్షలు ప్రారంభమైనట్లు వీఎస్‌యూ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

వీఎస్‌యూ డిగ్రీ, పీజీ పరీక్షల ప్రారంభం
వీఎస్‌యూ వైస్‌ చాన్సలర్‌ సుందరవల్లిని సన్మానిస్తున్న బోధనేతర సిబ్బంది

వెంకటాచలం, డిసెంబరు 2 : విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలల్లో గురువారం నుంచి డిగ్రీ రెండవ సెమిస్టర్‌, పీజీ పరీక్షలు ప్రారంభమైనట్లు వీఎస్‌యూ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం జరిగిన డిగ్రీ రెండవ సెమిస్టర్‌ పరీక్షల్లో 11,203 మంది విద్యార్థులకు గాను 9,963 మంది విద్యార్థులు హాజరు కాగా మిగిలిన 1,240 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. కాగా వీఎస్‌యూ రెక్టార్‌ ఎం.చంద్రయ్య పరీక్ష కేంద్రాలను సందర్శించారు. నెల్లూరులోని వీఆర్‌ ఐపీఎస్‌ కళాశాల, కాకుటూరులోని కృష్ణ చైతన్య పీజీ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు.   


వర్శిటీ బోధనేతర సిబ్బందితో ఆత్మీయ సమావేశం

వీఎస్‌యూలోని బోధనేతర సిబ్బందితో నూతన వైస్‌ చాన్సలర్‌ సుందరవల్లి గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూనివర్సిటీలో ముఖ్యమైన పాత్ర బోధనేతర సిబ్బందేనని, వారి  కృషి ఎనలేనిదని కొనియోడారు. త్వరలోనే బోధనేతర సిబ్బంది వేతనాలను పెంచుతామని, వారి విద్యా అర్హత, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకుని   పదోన్నతి కల్పిస్తామన్నారు. అనంతరం బోధనేతర కాంట్రాక్ట్‌ ఉద్యోగులు వీసీని   ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి, వర్సిటీ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు ఎండీ కలీం, జాయింట్‌ సెక్రటరీ స్రవంతి, కోశాధికారి రబ్బానీ బాషా, మీడియా సెక్రటరీ షేక్‌ ఉస్మాన్‌ అలీ, ఈసీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T04:37:52+05:30 IST