సింహగిరికి మరింత భద్రత
ABN , First Publish Date - 2020-10-02T09:56:04+05:30 IST
ప్రభుత్వ ఆదేశాల మేరకు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి భద్రతను మరింత పెంచనున్నారు.
అదనంగా సీసీ కెమెరాల ఏర్పాటు
ప్రచార రథానికి పక్కా షెల్టర్
అప్పన్న రథం చుట్టుపక్కల నిఘా ఏర్పాటు
ఆలయం వెనుక రాత్రుళ్లు కూడా కాపలా
బాంబ్ డిటెక్ట్ అండ్ డిస్పోజివ్ సిస్టమ్ అధికారుల సూచనలు
సింహాచలం, అక్టోబరు 1: ప్రభుత్వ ఆదేశాల మేరకు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి భద్రతను మరింత పెంచనున్నారు. ఈ మేరకు బాంబ్ డిటెక్ట్ అండ్ డిస్పోజివ్ సిస్టమ్ (బీడీడీఎస్) విభాగం అధికారులతో దేవస్థానం అధికారులు చర్చించారు. బీడీడీఎస్ విభాగం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సారథ్యంలో పలువురు అధికారులు గురువారం దేవస్థానం కార్యనిర్వాహక ఇంజనీర్ కోటేశ్వరరావు, తదితరులతో కలిసి ఆలయం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా బీడీడీఎస్ ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రచార రథానికి పక్కా షెల్టర్ను సింహగిరిపై ఏర్పాటుచేయాలని, కల్యాణోత్సవంలో వినియోగించే అప్పన్న రథం చుట్టుపక్కల నిఘా వుంచాలని, రథానికి అన్నివైపులా వెలుగు వుండేలా చూడాలని సూచించారు. అలాగే భాండాగారానికి మరింత సెక్యూరిటీ పెంచాలని, అలారం సిస్టమ్, బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ను పటిష్ఠం చేయాలని, ఆలయం వెనుక తూర్పు ప్రహరీ గోడ వైపు కూడా రాత్రుళ్లు కాపలా పెంచాలని, ప్రధాన రాజగోపురాలకు ఎదురుగానే కాకుండా అన్ని వైపులా సీసీ కెమెరాలు వుండాలని, డోర్ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటుచేయడంతో పాటు వాటిని వినియోగించడంపై సిబ్బందికి ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని సూచించారు. బీడీడీఎస్ విభాగం ఎస్ఐలు వాసు, సీతారామ్, చిరంజీవి, శివలతో పాటు దేవస్థానం డీఈఈ రమణ, ఏఈలు పాల్గొన్నారు.