518 మంది ఎస్జీటీలకు పోస్టింగులు
ABN , First Publish Date - 2020-09-28T10:38:13+05:30 IST
డీఎస్సీ-2018 ద్వారా ఎంపికైన సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులు (ఎస్జీటీ) 518 మందికి తొలిరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు పోస్టింగులు ఇచ్చారు.
నగరంలో రెండు చోట్ల, పాడేరులో కౌన్సెలింగ్
మైదానం పరిధిలో 242 మంది... ఏజెన్సీలో 105 మందికి...
ఐటీడీఏ పరిధిలో 85 మంది, జీవీఎంసీలో 86 మందికి ఉద్యోగాలు
సీతమ్మధార, సెప్టెంబరు 27: డీఎస్సీ-2018 ద్వారా ఎంపికైన సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులు (ఎస్జీటీ) 518 మందికి తొలిరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు పోస్టింగులు ఇచ్చారు. గురుద్వారా సమీపంలోని వసంతబాల విద్యావిహార్ పాఠశాలలో మైదానం, ఏజెన్సీ పాఠశాలలకు డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. మైదాన ప్రాంతాల్లోని పాఠశాలలకు 242 మందికి, ఏజెన్సీ పాఠశాలలకు 105 మందికి పోస్టింగ్లు అందజేశారు.
ఈ సందర్భంగా డీఈఓ లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ వసంత బాల పాఠశాల కౌన్సెలింగ్లో 347 మందికి, పోస్టింగ్లు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే, మున్సిపల్ యాజమాన్య పాఠశాలలో పోస్టింగ్ కోరుకున్న వారికి జీవీఎంసీ పాత కౌన్సెలింగ్ హాలులోను, ఐటీడీఏ పరిధిలో పాఠశాలల ఆప్షన ఎంపిక చేసుకున్న వారికి పాడేరు సీఏహెచ్ పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. జీవీఎంసీ పరిధిలో 86 మందికి, ఐటీడీఏ పరిధిలో 85 మందికి కలిపి మొత్తం 518 మందికి పోస్టింగ్ ఆర్డర్లు అందించామని వివరించారు.