నమ్మకంగా పనిచేసి...ఇంటికి కన్నం వేశాడు

ABN , First Publish Date - 2021-04-13T06:14:23+05:30 IST

నాలుగేళ్లపాటు కారు డ్రైవర్‌గా నమ్మకంగా పనిచేశాడు. ఇంట్లో వారందరితో దగ్గరగా మెలిగాడు. అదనుచూసి యజమాని ఇంట్లోని బీరువాలో దాచిన 629 గ్రాముల బంగారం, రూ.14 వేలు అపహరించాడు.

నమ్మకంగా పనిచేసి...ఇంటికి కన్నం వేశాడు
విలేకరుల సమావేశంలో మట్లాడుతున్న సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా, చిత్రంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు

బీరువాలో దాచిన 629 గ్రాముల బంగారం, రూ.14 వేలు అపహరణ

కారు డ్రైవర్‌గా పనిచేసి మానేసిన వ్యక్తి నిర్వాకం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): నాలుగేళ్లపాటు కారు డ్రైవర్‌గా నమ్మకంగా  పనిచేశాడు. ఇంట్లో వారందరితో దగ్గరగా మెలిగాడు. అదనుచూసి యజమాని ఇంట్లోని బీరువాలో దాచిన 629 గ్రాముల బంగారం, రూ.14 వేలు అపహరించాడు. ఏమీ తెలియనట్టు కొద్దిరోజులు పనిచేసి తర్వాత పని మానేశాడు. నెల రోజుల తర్వాత యజమాని బీరువా తీసి చూసేసరికి అందులో ఉండాల్సిన ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో ఈ నెల తొమ్మిదిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి చోరీ సొత్తును రికవరీ చేశారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌  ఆవరణలోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు.

 అక్కయ్యపాలెంలోని లలితానగర్‌లో నరవ రాంబాబు నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో ముగ్గురు పని మనుషులు, ఒక కారు డ్రైవర్‌ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో రాంబాబు గతనెల ఐదున బీరువాను తెరిచి చూడగా ఆభరణాలు, నగదు ఉండడంతో తర్వాత బీరువాకి తాళం వేశారు. ఈ నెల ఏడున మరోసారి బీరువా తెరిచి చూడగా ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఇంట్లోవారితో దీనిపై చర్చించిన తర్వాత ఈ నెల తొమ్మిదిన ఫోర్త్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్రైమ్‌ డీసీపీ సురేశ్‌బాబు, సీఐ సింహాద్రినాయుడు కలిసి చోరీ జరిగిన తీరుని పరిశీలించారు. అక్కడ ఆనవాళ్లను చూసిన తర్వాత తెలిసినవారి పనే అయివుంటుందనే అనుమానంతో ఇంటి సభ్యులతోపాటు ఇంట్లో పనివాళ్లను విచారించారు. ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ 15 రోజుల ఫుటేజీ మాత్రమే ఉండడంతో నిందితులను గుర్తించే అవకాశం లేకపోయింది. అనుమానితుల వ్యవహారశైలిపై రహస్యంగా నిఘా ఉంచడంతో రాంబాబు వద్ద డ్రైవర్‌గా పనిచేసి మార్చి 23న మానేసిన చోడవరానికి చెందిన కిలపర్తి రామకృష్ణ అలియాస్‌ కృష్ణ(30) విలాసంగా గడుపుతున్నట్టు తేలడంతో అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా చోరీ సొత్తును భద్రపరిచిన పట్నాల రాము(50)ని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 537 గ్రాముల బంగారం, రూ.14 వేలు నగదు రికవరీ చేశారు. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీపీ తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యహరించిన డీసీపీ సురేశ్‌బాబు, ఏసీపీ శ్రావణ్‌కుమార్‌, సీఐలు సింహాద్రినాయుడు, రామచంద్రరావు, అవతారం, ఇతర సిబ్బందిని సీపీ అభినందించారు. 


Updated Date - 2021-04-13T06:14:23+05:30 IST