అసెంబ్లీలో అలా, లోక్‌సభలో ఇలా.. బీజేపీపై ఓటర్ల భిన్న వైఖరి

ABN , First Publish Date - 2021-05-03T00:58:33+05:30 IST

ఈ పరంపర 2019లోనూ కనిపించింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతో పాటే జరిగాయి. కాగా ఓడిశాలో మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలిచినప్పటికీ అసెంబ్లీలో చాలా తక్కువ స్తానాలకు పడిపోయింది

అసెంబ్లీలో అలా, లోక్‌సభలో ఇలా.. బీజేపీపై ఓటర్ల భిన్న వైఖరి

న్యూఢిల్లీ: 2014 నుంచి చిన్న చిన్న ఓటములు మినహా అడుగుపెట్టిన ప్రతిచోట విజయ ధుంధుభి మోగిస్తున్న భారతీయ జనతా పార్టీకి ప్రజలు భిన్నమైన తీర్పులు ఇస్తున్నారు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉంటున్న ఓటర్లు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారు. సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వస్తున్న ఓట్లు, సీట్లు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.


2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు గెలుచుకుంది. గుజరాత్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ.. బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అస్సాం రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. అయితే అనంతరం 2015లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ నాటి ఫలితాలను రాబట్టలేక పోయింది. ఇక 2018లో అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ద్వితీయ స్థానానికి పడిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే లోక్‌సభలో వచ్చిన ఫలితాలను అసెంబ్లీ ఎన్నికల్లోనూ సాధించగలిగింది. ఇక హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానాల్లోనూ గెలుపొందింది.


ఈ పరంపర 2019లోనూ కనిపించింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతో పాటే జరిగాయి. కాగా ఓడిశాలో మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలిచినప్పటికీ అసెంబ్లీలో చాలా తక్కువ స్తానాలకు పడిపోయింది. సాధారణ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం గెలుచుకున్న బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల్లో 4 స్థానాలను గెలుచుకుంది. ఈ వివరాల్ని బట్టి చూస్తుంటే జాతీయ స్థాయిలో బీజేపీకి లభిస్తున్న ఆదరణ ప్రాంతీయ స్థాయిలో లభించడం లేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వచ్చినా వేరు వేరు సందర్భాల్లో జరిగినా ప్రజా తీర్పు మాత్రం భిన్నంగానే ఉంటూ వస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ధోరణి కనిపించింది. సాధారణ ఎన్నికల్లో 18 లోక్‌సభ స్థానాలు గెలచుకున్న బీజేపీ.. కనీసం ఆ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలను కూడా గెచుకోవడంలో తడబడుతోంది.

Updated Date - 2021-05-03T00:58:33+05:30 IST