Aadhaar Linking: ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం
ABN , First Publish Date - 2022-07-30T13:41:00+05:30 IST
ఓటరు కార్డు(Voter card)కు ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) ఆగస్టు 1 నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఓటర్ల
- ఎల్లుండి నుంచి వివరాల సేకరణ
ప్యారీస్(చెన్నై), జూలై 29: ఓటరు కార్డు(Voter card)కు ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) ఆగస్టు 1 నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్లున్న వారు 2023 ఏప్రిల్ నాటికి ఎన్నికల సంఘానికి తమ ఆధార్ నెంబరు సమర్పించాలి. ఆధార్ నెంబరు ఇవ్వనంత మాత్రాన జాబితా నుంచి పేర్లు తొలగించమని భారత ఎన్నికల సంఘం(Election Commission of India) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, నగరంలో జనవరి 5వ తేది విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో ఒక వ్యక్తి రెండు ప్రాంతాల్లో ఓటరు గుర్తింపుకార్డు ఉన్నట్లు గుర్తించారు. 200 వార్డుల్లో లక్ష మందికి పైగా రెండు ప్రాంతాల్లో ఓటరు గుర్తింపుకార్డులు ఉన్నట్లు గుర్తించి వాటిని రద్దు చేశారు. నకిలీ(Fake) ఓటరు గుర్తింపుకార్డులను గుర్తించేలా జీసీసీ ఎన్నికల విభాగం, ఒకటోతేదీ నుంచి ఓటరు గుర్తింపుకార్డుతో ఆధార్ అనుసంధాన పనులు చేపట్టనుంది. ఒకవేళ ఆధార్ నెంబరు ఇవ్వడానికి ఇష్టపడని వారు పాన్కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర 11 ప్రత్యామ్నాయ ఆధారాలు సమర్పించవచ్చు. దీనిపై సంబంధిత ఎన్నికల విభాగం అధికారులకు సోమవారం నుంచి జీసీసీ శిక్షణా తరగతులు నిర్వహించనుంది. ఇందుకోసం 3,750 పోలింగ్ అధికారుల అధ్యక్షతన బృందాలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాలో ఆధార్ నెంబరు అనుసంధాన ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ పనులన్నీ 2023 మార్చి 31లోగా పూర్తిచేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఇదిలా ఉండగా, ఆగస్టు 1వ తేది నుంచి ఆధార్ వివరాల సేకరణ ప్రజల్లో అవగాహన కల్పించేలా జీసీసీ ప్రచారం చేపట్టనుంది.
సమాచారం సురక్షితం...
ఆధార్ సంఖ్య సేకరణ, నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఆ సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెల్లడించమని జీసీసీ స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలోని పేరును ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గం(Constituency)లోకి మార్చుకొనేందుకు ‘ఫారం-6’ బదులు ‘ఫారం-8’లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆధార్ వివరాల సేకరణ కోసం ఇళ్లకు వచ్చే అధికారుల బృందాలకు ఓటర్లు తమ వంతు సహకారం అందించాలని జీసీసీ విజ్ఞప్తి చేసింది.